IPL 2021 CSK VS RCB: షార్జాలో సీఎస్కే ముందు మోస్తారు టార్గెట్ ఉంచిన ఆర్సీబీ
IPL 2021: తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి (virat kohli) సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Banglore) చెన్నై సూపర్ కింగ్స్ (chennai Super Kings) ముందు మోస్తారు లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
ఓపెనర్లు శుభారంభాన్నిచ్చినా మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు షార్జాలో సీఎస్కే ముందు ఓ మోస్తారు లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్ కు ముందు ఇసుక తుఫాను కారణంగా పది నిమిషాలు ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్ లో ఓపెనర్లు విరాట్ కోహ్లి (41 బంతుల్లో 53 4*6, 6*1), దేవదత్ పడిక్కల్ (50 బంతుల్లో 70 4*5 6*3 ) అదరగొట్టారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే సీఎస్కే బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించిన బెంగళూరు ఓపెనర్లు.. 35 బంతుల్లోనే అర్థసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి పవర్ ప్లేలో దూకుడుగా ఆడిన కోహ్లీ, పడిక్కల్ లు తర్వాత నిలకడ ప్రదర్శించారు. ఈ క్రమంలోనే ఇరువురు అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
హాఫ్ సెంచరీ చేసి దూకుడు మీదున్న కోహ్లిని 13.2 ఓవర్లో డ్వేన్ బ్రావో బోల్తా కొట్టించాడు. బ్రావో వేసిన బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా జడేజా చేతికి చిక్కాడు. కోహ్లి ఔట్ అయ్యాక బ్యాటింగ్ కు దిగిన మిస్టర్ 360 డివిలియర్స్ మరోసారి విఫలమయ్యాడు. 12 పరుగులు చేసిన ఏబీ.. 16.5 ఓవర్లో ఠాకూర్ బౌలింగ్ లో రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కోహ్లి, డివిలియర్స్ ఔట్ అయినా వరుసగా సిక్సర్లు బాదుతూ ఊపు మీద కనిపించిన పడిక్కల్ ఠాకూర్ తర్వాత ఓవర్ లో షార్ట్ బాల్ కు రాయుడుకు క్యాచ్ ఇచ్చాడు.
ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్ కు దిగిన మ్యాక్స్ వెల్ (11) పెద్దగా ఆకట్టుకోలేదు. చెన్నై బౌలర్లలో శార్ధుల్ ఠాకూర్, బ్రావోలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనున్న చెన్నై ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందడుగు వేయాలని భావిస్తున్నది.