Asianet News TeluguAsianet News Telugu

రోహిత్‌ని చూసి ఏడ్చేసిన బుల్లి అభిమాని... బుగ్గ గిల్లి బుజ్జగించిన టీమిండియా కెప్టెన్...

గౌహతిలో తొలి వన్డే ఆడబోతున్న టీమిండియా... రోహిత్ శర్మ చూసి ఆనందం తట్టుకోలేక ఏడ్చేసిన బుల్లి అభిమాని... 

Rohit Sharma interacts with Young fans who got emotional after seeing him
Author
First Published Jan 10, 2023, 12:25 PM IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుత భారత జట్టులో విరాట్ కోహ్లీ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ రోహిత్ శర్మనే. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, 2022లో మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు...

బంగ్లాదేశ్ టూర్‌లో రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన రోహిత్ శర్మ, మూడో వన్డేతో పాటు రెండు టెస్టుల సిరీస్‌కి దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కి దూరంగా ఉన్న రోహిత్ శర్మ, వన్డే సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు. గౌహతి వేదికగా జరుగుతున్న తొలి వన్డే కోసం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాడు రోహిత్ శర్మ...

గౌహతిలో రోహిత్ శర్మను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో బర్సపరా క్రికెట్ స్టేడియానికి చేరుకున్నారు. రోహిత్‌ని చూసిన ఓ బుల్లి అభిమాని, ఉద్వేగం తట్టుకోలేక అరుస్తూ ఏడ్చేశాడు. అతన్ని గమనించిన రోహిత్ శర్మ, పిల్లాడి దగ్గరికి వెళ్లి బుజ్జగించి ఊరుకోబెట్టాడు...

‘ఎందుకు ఏడుస్తున్నావ్... నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి. నీ బుగ్గలు ముద్దుగా భలేగున్నాయి... ’ అంటూ బుగ్గలు లాగుతూ ముద్దు చేశాడు రోహిత్ శర్మ. తన అభిమాని క్రికెటర్‌ని చూసిన ఆనందంలో ఉద్వేగానికి లోనై ఏడ్చేసిన ఆ బుల్లి అభిమాని, రోహిత్ శర్మ మాటలకు నవ్వేశాడు. ఆ కుర్ర అభిమాని సెల్ఫీ ఇచ్చిన రోహిత్ శర్మ, అక్కడి నుంచి ప్రాక్టీస్ సెషన్స్‌కి వెళ్లిపోయాడు... ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. 

హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో 2-1 తేడాతో శ్రీలంకతో  టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టు, నేటి నుంచి వన్డే సిరీస్‌లో పాల్గొంటోంది. టీ20 సిరీస్‌కి దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ వంటి సీనియర్లు, వన్డే సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. గౌహతిలో ఆడిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా సెంచరీలు చేసుకున్నారు...

అస్సాంలో జరుగుతున్న ఈ వన్డే మ్యాచ్‌ని చూసేందుకు ఒక్క పూట సెలవు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగనుంది. 2011లో ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్ టైటిల్ సాధించిన భారత జట్టు, ఈసారి టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి మొదటి సన్నాహకంగా ఇండియా వర్సెస్ శ్రీలంక వన్డే సిరీస్‌ని భావిస్తున్నారు... 

Follow Us:
Download App:
  • android
  • ios