IND vs AUS: దినేశ్ కార్తీక్పై రోహిత్ ఆగ్రహం.. మెడపట్టి, పళ్లు కొరుకుతూ ఊగిపోయిన హిట్మ్యాన్
Rohit Sharma - Dinesh Karthik: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మంగళవారం మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత జట్టు బౌలింగ్ వైఫల్యంతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ పై హిట్మ్యాన్ ఆగ్రహంతో ఊగిపోయాడు.
మొహాలీలో ముగిసిన ఇండియా-ఆస్ట్రేలియా తొలి టీ20లో 208 పరుగుల భారీ స్కోరు చేసినా భారత బౌలర్లు దానిని కాపాడుకోలేదు. బౌలర్ల వైఫల్యంతో భారత్ కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ పై ఆగ్రహంతో ఊగిపోయిన హిట్మ్యాన్.. అతడి మెడపట్టి దవడ దగ్గర గట్టిగా నొక్కుతూ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే ఆసీస్ ఓపెనర్లు ఆరోన్ ఫించ్, కామెరూన్ గ్రీన్ లు భారత బౌలర్ల దుమ్ము దులిపారు. పదో ఓవర్లోనే ఆసీస్ విజయం దిశగా దూసుకుపోయింది. ఆ క్రమంలో 12వ ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో గ్లెన్ మ్యాక్స్వెల్ కీపర్ క్యాచ్ ఇచ్చాడు.
ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లంతా అవుట్ కోసం అప్పీల్ చేశారు. కానీ వికెట్ కీపర్ కార్తీక్ మాత్రం కాస్త సందేహంగా అప్పీల్ చేయడానికి వెనుకాడాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో బంతి మ్యాక్స్వెల్ బ్యాట్ ను తాకుతూ వెళ్లింది. దీంతో మ్యాక్సీ అవుట్ అయ్యాడు.
అయితే రివ్యూ కోరే సమయంలో ఆటగాళ్లంతా ఒక్కచోట చేరగా.. అవుట్ కోసం అప్పీల్ ఎందుకు చేయలేదని రోహిత్.. కార్తీక్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పటికే చాహల్ వేసిన ఓ ఓవర్లో గ్రీన్ ఎల్బీడబ్ల్యూ అని స్పష్టంగా తేలినా భారత్ దానికి అప్పీల్ చేయకపోవడంతో అతడు బతికిపోయాడు. దాంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ కారణంగానే రోహిత్.. కార్తీక్ దగ్గరికొచ్చి మెడపట్టి దవడ దగ్గర గట్టిగా నొక్కుతూ ‘ఎందుకు అప్పీల్ చేయడం లేదు..’ అని ఆగ్రహించాడు. అయితే ఇదంతా ఫన్నీగానే.
వాస్తవానికి రోహిత్-కార్తీక్ మంచి స్నేహితులు. 2007 టీ20 ప్రపంచకప్ నుంచి ఇద్దరూ కలిసి ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో కూడా రోహిత్ తన తల దగ్గర పట్టుకున్నా కార్తీక్ నవ్వుకుంటూనే ఉన్నాడు. ఇక మ్యాక్సీ అవుటని తేలాక రోహిత్.. కార్తీక్ ను ఇమిటేట్ చేస్తూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తో టీమిండియా సభ్యుల ముఖాల్లో నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మ్యాచ్ విషయానికిస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా (71 నాటౌట్), కెఎల్ రాహుల్ (55), సూర్యకుమార్ యాదవ్ (46) రాణించారు. అనంతరం ఆసీస్.. 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కామెరూన్ గ్రీన్ (61) వీరవిహారానికి తోడు మాథ్యూ వేడ్ (45) మెరుపులతో ఆసీస్ నే విజయం వరించింది.