Rishabh Pant: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మళ్ళీ ఫ్లాప్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో కేవలం 7 పరుగులు చేసి ఔటయ్యాడు.
Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తుది దశకు చేరుకుంది. అయితే, ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా, కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ బ్యాట్ ఈ సీజన్ లో అస్సలు పనిచేయడం లేదు. వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాడు. ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా 61వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు లక్నోలోని ఏకానా స్టేడియంలో తలపడ్డాయి.
ఈ మ్యాచ్ లో లక్నో ముందుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఆడమ్ మార్క్రమ్ ధాటిగా ఆడారు. వీళ్ళిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 115 పరుగులు జోడించారు. ఆ తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ పై అభిమానులకు చాలా ఆశలు.. అంచనాలున్నాయి. కానీ, అతను మళ్ళీ పంక్చర్ సైకిల్ లా తన వికెట్ ను పోగొట్టుకున్నాడు.
అవును, రిషబ్ పంత్ ఈ సీజన్లో మళ్ళీ ఫ్లాప్ అయ్యాడు. SRH తో మ్యాచ్ లో కేవలం 6 బంతుల్లో 7 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సీజన్లో పంత్ ఇలా ఔటవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఒక్క మ్యాచ్ లో కూడా అతను బాగా ఆడలేదు. 10 మ్యాచ్ లలో కేవలం 118 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నైతో మ్యాచ్ లో చేసిన 63 పరుగులు మినహాయిస్తే మిగతా మ్యాచ్ లలో పెద్దగా రాణించలేదు. 6 ఇన్నింగ్స్ లో సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యాడు. మొదటి మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మరోసారి సున్నాకే ఔటయ్యాడు. అతని ఈ దారుణ ప్రదర్శనతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
లక్నో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన పంత్
IPL చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా, కెప్టెన్ గా లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న రిషబ్ పంత్ ను ఫ్రాంచైజీ IPL 2025 మెగా వేలంలో 27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అతనిపై జట్టు, మేనేజ్మెంట్ చాలా ఆశలు పెట్టుకున్నాయి. కానీ, అతను ఆ ఆశలను అందుకోలేకపోయాడు. జట్టు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అతని చెత్త ప్రదర్శన మేనేజ్మెంట్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కెప్టెన్సీలో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
IPL 2025 ప్లేఆఫ్స్ కు చేరుకోవాలంటే కష్టపడాల్సిందే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ లక్నో సూపర్ జెయింట్స్ కు అంతంత మాత్రంగానే ఉంది. మొదట్లో జట్టు బాగానే ఆడింది. మిచెల్ మార్ష్, ఆడమ్ మార్క్రమ్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని ఎక్కువ పరుగులు చేశారు. రిషబ్ పంత్ తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకున్నా కూడా అతని అదృష్టం మారలేదు. LSG ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో 11 మ్యాచ్ లలో 5 విజయాలు, 6 ఓటములతో ఏడో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ కు చేరుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్ లు గెలవాల్సిందే. ఆ తర్వాత కూడా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది.