మోదీ స్టేడియంలో ఎమోషనల్ సీన్ ...దినేశ్ కార్తిక్ కు గట్టి హగ్ తో వీడ్కోలు పలికిన కోహ్లీ
అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం ఎమోషనల్ మూమెంట్స్ కు వేదికయ్యింది. ఆర్సిబి ఐపిఎల్ ట్రోపీ కల చెదిరిపోవడంతో పాటు దినేశ్ కార్తిక్ రిటైర్మెంట్ తో ఆ టీం ఆటగాళ్లకే కాదు అభిమానులకు హృదయం బరువెక్కింది.
![Retiring Dinesh Karthik Gets Guard Of Honour in Ahmedabad AKP Retiring Dinesh Karthik Gets Guard Of Honour in Ahmedabad AKP](https://static-ai.asianetnews.com/images/01hygzsd8xsvffra0eqvp4zxtp/rr-vs-rcb-41_363x203xt.jpg)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి మరో ఆటగాడు రిటైర్ అయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దినేశ్ కార్తిక్ బుధవారం చివరి ఐపిఎల్ మ్యాచ్ ఆడేసాడు. మ్యాచ్ ఓడిన బాధ ఓవైపు... ఇకపై ఆర్సిబికి ఆటలేననే బాధ మరోవైపు... ఇలా బరువెక్కిన హృదయంతో ఐపిఎల్ కు గుడ్ బై చెప్పాడు దినేశ్ కార్తిక్.
చివరి ఐపిఎల్ మ్యాచ్ ఆడిన కార్తిక్ కు ఆర్సిబి ఆటగాళ్ళు సాదరంగా వీడ్కోలు పలికారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సహచరుడి రిటైర్మెంట్ పై భావోద్వేగానికి గురయ్యారు. మైదానంలోనే కార్తిక్ ను గట్టిగా హగ్ చేసుకుని ఎమోషన్ అయ్యారు. అలాగే మిగతా ఆర్సిబి ప్లేయర్స్ కూడా కార్తిక్ గౌరవంగా వీడ్కోలు పలికారు. సహచర ఆటగాళ్ళ చప్పట్ల మధ్య ప్రేక్షకులకు అభివాదం చేస్తూ మైదానాన్ని వీడాడు దినేశ్ కార్తిక్.
నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ తో కార్తిక్ 17 ఏళ్ల ఐపిఎల్ కెరీర్ ముగిసింది. అతడు ఐపిఎల్ లో ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. డిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడిగా 2008 లో అతడి ఐపిఎల్ జర్నీ ప్రారంభమయ్యింది... ఆ తర్వాత కింగ్స్ లెవన్ పంజాబ్చ ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లలో ఆడాడు. చివరగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడిగా ఐపిఎల్ కు వీడ్కోలు పలికాడు.
ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు సాధించి ఐపిఎల్ చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నా కార్తిక్. ధనాధన్ బ్యాటింగ్ తోనే కాదు అద్భుతమైన కీపింగ్ తో క్రికెట్ ప్రియులను అలరించాడు. ఇలా తన ఐపిఎల్ కెరీర్ లో 257 మ్యాచులు ఆడిన కార్తిక్ 4,842 పరుగులు చేసాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు వున్నాయి.
ఈ సీజన్ లో కూడా కార్తిక్ అద్భుతంగా ఆడాడు. ఆర్సిబి తరపున 15 మ్యాచులాడిన కార్తిక్ 187 స్ట్రైక్ రేట్ తో 326 పరుగులు చేసాడు. అయితే ఐపిఎల్ ట్రోపీతో వీడ్కోలు పలకాలనుకున్న అతడి కల మాత్రం నెరవేరలేదు. బుధవారం రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆర్సిబి ఓటమిపాలై ఐపిఎల్ 2024 లో తన పోరాటాన్ని ముగించింది.