స్లో ఓవర్ రేటును నియంత్రించేందుకు కొత్త నిబంధన... కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో వినూత్న నిర్ణయం.. 

ఫుట్‌బాల్‌లో రెడ్ కార్డ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఏ ప్లేయర్ అయినా అతిగా ప్రవర్తించినా, వేరే ఆటగాడిని గాయపరిచినా అతన్ని బయటికి పంపించేందుకు రెడ్ కార్డు వాడతారు రిఫరీ. ఈ ఫార్ములాని క్రికెట్‌లోకి కూడా తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

స్లో ఓవర్ రేటును నియంత్రించేందుకు ఐసీసీ, గత ఏడాది కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. టీ20ల్లో షెడ్యూల్ సమయంలోగా వేయాల్సిన ఓవర్లు పూర్తి చేయకపోతే టైం అయిపోయిన తర్వాత వేసే ఓవర్లలో ఫీల్డింగ్ సెట్టింగ్స్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. 30 యార్డ్స్ సర్కిల్‌లో ఓ ఫీల్డర్‌ని ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది..

వన్డేల్లో కూడా ఇదే రూల్‌ని అమలు చేయాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ స్లో ఓవర్ రేటుని నియంత్రించేందుకు మరో అడుగు ముందుకు వేసిన కరేబియన్ ప్రీమియర్ లీగ్, ఫుట్‌బాల్ తరహాలో రెడ్ కార్డ్ నిబంధనను క్రికెట్‌లోకి తీసుకురావాలని అనుకుంటోంది..


‘కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో టీ20 మ్యాచులు నిర్ణీత సమయంలో పూర్తి కావడం లేదు. ఏళ్లు గడిచే కొద్దే మ్యాచ్ సమయం మరింత పెరుగుతూ పోతోంది. అయితే ఇకపై దీన్ని పూర్తిగా నియంత్రించాలని అనుకుంటున్నా.. 

మ్యాచ్ ఆలస్యం అయ్యేకొద్దీ ఫ్యాన్స్ కూడా అసహనానికి గురవుతారు. అందుకే షెడ్యూల్ సమయంలోగా మ్యాచ్‌ని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్లేయర్లకు, ఫ్రాంఛైజీలకు, అధికారులకు ఉంటుంది. పెనాల్టీలు వేయాలని మేం అనుకోవడం లేదు, అయితే ఇలాంటి రూల్ తేవడం వల్ల స్లో ఓవర్ రేటు తగ్గుతుందని ఆశిస్తున్నాం..’ అంటూ కామెంట్ చేశాడు కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైకేల్ హాల్..

ఈ రూల్ ప్రకారం 18వ ఓవర్‌ షెడ్యూల్ సమయానికి పూర్తి కాకపోతే మిగిలిన 2 ఓవర్లలో ఓ ఫీల్డర్, 30 యర్డ్స్ సర్కిల్‌లో మోహరించాల్సి ఉంటుంది. ఆఖరి ఓవర్ కూడా ఆలస్యంమైతే ఇద్దరు ఫీల్డర్లు 30 యార్డ్స్‌లోకి రావాల్సి ఉంటుంది. అంటే 6 ఫీల్డర్లు సర్కిల్ లోపలే ఉంటారు..

అప్పుడు 20వ ఓవర్‌లో రెడ్ కార్డ్ సిస్టమ్ అమలులోకి వస్తుంది. చివరి ఓవర్‌లో ఓ ప్లేయర్‌ని రెడ్ కార్డు ద్వారా బయటికి పంపుతారు. ఎవరిని బయటికి పంపాలనే విషయంపై కెప్టెన్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాటింగ్ టీమ్ కావాలని సమయాన్ని వృథా చేస్తున్నట్టు అంపైర్లు భావిస్తే.. రెండు సార్లు వార్నింగ్ ఇస్తారు. అయినా తీరు మారకపోతే 5 పరుగులను పెనాల్టీగా కట్ చేస్తారు..

ఒక్కో టీ20 ఇన్నింగ్స్ ముగియడానికి 85 నిమిషాల నిర్ణీత సమయాన్ని కేటాయించింది సీపీఎల్. 72 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 18వ ఓవర్‌ని 76 నిమిషాల 30 సెకన్లలో, 19వ ఓవర్‌ని 80 నిమిషాల 45 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతీ ఓవర్ పూర్తి చేయడానికి 4 నిమిషాల 15 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది.. లేటు అయ్యే కొద్దీ రెడ్ కార్డ్ రావడానికి ఛాన్సులు పెరుగుతూ పోతాయి.