ప్రపంచానికి అవసరం లేదు, నాకు నేనే...: రవీంద్ర జడేజా
తానేమిటో ప్రపంచానికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదని రవీంద్ర జడేజా అన్నాడు. తానేమిటో తనకు తెలుసునని, తనకు తాను సమాధానం చెప్పుకోగలిగితే చాలునని ఆయన అన్నాడు.
కటక్: తానేమిటో ప్రపంచానికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదని టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. కటక్ లో వెస్టిండీస్ పై జరిగిన మూడో వన్డేలో తన ప్రదర్శనపై ఆయన మాట్లాడాడు. తాను ఏం ఆడగలనో తనకు తెలుసునని, తనకు తాను సమాధానం చెప్పుకోగలిగితే చాలునని అన్నాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్ లో తాను ఇంగా సత్తా చాటగలనని ఈ మ్యాచుతో చూపించినట్లు తెలిపాడు. ఈ ఏడాది తాను ఎక్కువగా వన్డేలు ఆడలేదని, అయితే కీలకమైన దశలో సిరీస్ విజయానికి అవసరమైన రీతిలో తన అత్యుత్తమ ఆట తీరును కనబరిచేందుకు ప్రయత్నించానని అన్నాడు.
టీమిండియా ఈ ఏడాది 28 వన్డేలు వాడితే వాటిలో 15 మ్యాచుల్లో జడేజా ఆడాడు. జడేజా ప్రదర్శనపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు. జడేజా బ్యాటింగ్ మెరుగుపడడం సానుకూలమైన విషయమని ఆయన అన్నాడు.
వెస్టిండీస్ తో కటక్ లో జరిగిన చివరి వన్డేలో భారత విజయానికి అవసరమైన రీతిలో జడేజా ప్రదర్శన కనబరిచాడు. మూడో వన్డేలో 39 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.