Ranji Trophy 2025: 2017-19 మధ్య రెండుసార్లు టైటిల్ గెలుచుకున్న విదర్భ.. 2024-25 ఎడిషన్లో నాగ్పూర్లో జరిగిన ఫైనల్లో కేరళపై విజయంతో తన ఖాతాలో మూడో టైటిల్ ను వేసుకుంది.
Ranji Trophy 2025: 2024-25 రంజీ ట్రోఫీ టైటిల్ను విదర్భ గెలుచుకుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఫైనల్లో కేరళను ఓడించింది. విదర్భ జట్టు 7 సంవత్సరాలలో మూడోసారి ఛాంపియన్గా నిలిచింది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ 5వ రోజు విదర్భ మ్యాచ్ ను డ్రా చేయడంతో ఛాంపియన్ గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో ఆ టీమ్ 379 పరుగులు చేసింది. కేరళ జట్టు తొలి ఇన్నింగ్స్లో 342 పరుగులు చేసింది. దీంతో విదర్భకు 37 పరుగుల ముఖ్యమైన ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో ఓపికగా బ్యాటింగ్ చేసి 143.5 ఓవర్లలో 9 వికెట్లకు 375 పరుగులు చేసింది.
తొలిసారి ఫైనల్కు చేరుకున్న కేరళ కూడా గట్టి పోటీ ఇచ్చింది కానీ విదర్భ ఈ సీజన్ అంతటా అద్భుతమైన ప్రదర్శనతో టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ సీజన్ లో రంజీ ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా, ఆ జట్టు 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీలో రన్నరప్గా కూడా నిలిచింది.
మూడో సారి రంజీ ట్రోఫీ టైటిల్ గెలుచుకున్న విదర్భ
విదర్భ మూడోసారి రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకుంది. అంతకుముందు ఆ టీమ్ 2017-18, 2018-19 సీజన్లలో వరుసగా రెండు టైటిళ్లను గెలుచుకుంది. ఈ విజయంతో విదర్భ భారత దేశవాళీ క్రికెట్లో బలమైన జట్లలో ఒకటిగా నిలిచింది. గత రంజీ సీజన్లో విదర్భ రన్నరప్గా నిలిచింది.
కరుణ్ నాయర్ అదరగొట్టాడు
ఆదివారం జరిగి మ్యాచ్ లో విదర్భ ప్రణాళిక ప్రకారం ఆడింది. తొమ్మిది వికెట్లకు 375 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ సెంచరీతో అదరగొట్టాడు. కరుణ్ నాయర్ 135 పరుగులు (295 బంతులు, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సహాయంతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. డానిష్ మాలేవర్ 73 పరుగులు, దర్శన్ నల్కండే అజేయంగా 51 పరుగులు సాధించారు. ఈ యంగ్ ప్లేయర్ల సూపర్ షో తో విదర్బ విజయాన్ని అందుకుంది.
హర్ష్ దుబే బౌలింగ్ తో అదరగొట్టేశాడు
22 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్నర్ హర్ష్ దుబే రంజీ ట్రోఫీ సీజన్లో 69 వికెట్లు తీసుకున్నాడు. ఆదివారం నాగ్పూర్లో కేరళతో జరిగిన ఫైనల్ ముగింపులో విదర్భకు చెందిన హర్ష్ దుబే 2024-25 రంజీ ట్రోఫీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అశుతోష్ అమన్ ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును బద్దలు కొట్టాడు. పది మ్యాచ్ల్లో 69 వికెట్లు తీసి, ఒక వికెట్ తేడాతో దానిని అధిగమించాడు.
ఈ సీజన్ను దుబే 16.98 అత్యుత్తమ సగటుతో ముగించాడు. ఏడు సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. 36 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఆకిబ్ నబీ 44 వికెట్లతో రెండవ స్థానంలో నిలిచాడు. ముంబై ఎడమచేతి వాటం స్పిన్నర్ షమ్స్ ములానీతో సమానంగా ఉన్నాడు. కేరళ జట్టుకు చెందిన ఫైనలిస్ట్ ఆఫ్ స్పిన్నర్ జలజ్ సక్సేనా 40 వికెట్లతో మరో విజయవంతమైన సీజన్ను కొనసాగించాడు.
2024-25 రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా యష్ రాథోడ్
విదర్భకు చెందిన యష్ రాథోడ్ 2024-25 రంజీ ట్రోఫీ ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ తన జట్టు టైటిల్ గెలుచుకోవడంలో కీలక ఇన్నింగ్స్ లను ఆడాడు. 53.33 సగటుతో 960 పరుగులు చేశాడు. ఈ సీజన్లో రాథోడ్ 10 మ్యాచ్ లలో 5 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు సాధించాడు.
ఈ సీజన్లో టాప్-5 పరుగులు సాధించిన వారి జాబితాలో ఉన్న ముగ్గురు విదర్భ బ్యాటర్లలో రాథోడ్ ఒకరు, కరుణ్ నాయర్, డానిష్ మాలేవర్ వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచారు. అలాగే, మధ్యప్రదేశ్ కెప్టెన్ శుభమ్ శర్మ కేవలం 7 మ్యాచ్ లలో 104.77 సగటుతో 943 పరుగులతో రాథోడ్ తర్వాత రెండవ స్థానంలో నిలిచాడు.
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో 900 పరుగుల మార్కును దాటిన ప్లేయర్లలో హైదరాబాద్కు చెందిన తన్మయ్ అగర్వాల్ కూడా ఉన్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ 77.83 సగటుతో 934 పరుగులు చేశాడు.
అద్భుతమైన ఫామ్లో కరుణ్ నాయర్
ఈ సీజన్లో విదర్భలో చేరిన అనుభవజ్ఞుడైన కరుణ్ నాయర్, విజయ్ హజారే ట్రోఫీలో ఐదు సెంచరీలతో జట్టును ముందుకు నడిపించడమే కాకుండా, రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా కూడా నిలిచాడు. తొమ్మిది మ్యాచ్ల్లో నాలుగు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో 53.93 సగటుతో 863 పరుగులు చేశాడు.
ఫైనల్లో నాయర్ 86, 135 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడాడు. అలాగే, 21 ఏళ్ల మాలేవర్ రెండు సెంచరీలు, 6 అర్ధ సెంచరీల సహాయంతో 52.20 సగటుతో 783 పరుగులతో ఐదవ స్థానంలో నిలిచాడు. అతను ఫైనల్లో 153, 73 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడాడు. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
ఇది కూడా చదవండి:
IND Vs NZ: వరుస వికెట్లతో న్యూజిలాండ్ భరతంపట్టిన వరుణ్ చక్రవర్తి.. వీడియో
Champions Trophy : వరుసగా 10వ సారి ఓడిన రోహిత్ శర్మ.. భారత్ గెలుస్తుంది.. ఇదెక్కడిలెక్క సామి !
IND Vs NZ: వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పితే అట్లుంటది మరి !