Punjab vs KKR IPL:  ఐపీఎల్ 2025లో శనివారం సాయంత్రం జరిగిన  కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ఈడెన్ గార్డెన్స్ వేదకగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన కోల్‌కతా జట్టు కేవలం 7 పరుగుల చేయగా.. ఆ తర్వాత వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతసేపటికీ ఆగిపోకపోవడంతో చాల సేపు అంతరాయం ఏర్పడింది. మధ్యలో కాస్త వర్షం ఆగినట్టు కనిపించగా.. మ్యాచ్‌ను ఎంపైర్లు ప్రారంభించారు. ఈ సమయంలో మరోసారి వాన ప్రారంభంకావడంతో  ఇక మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. రెండు జట్లకు చెరోపాయింట్‌ ఇచ్చారు.   

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. కేకేఆర్‌ బౌలర్లపై విరుచుకుపడుతూ.. పరుగులు సాధించారు. ముఖ్యంగా యంగ్‌ టాలెంటెడ్‌ ప్రియాంశ్‌ ఆర్య బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. కేవలం 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సుల కొట్టి.. 69 పరుగులు సాధించాడు. ఇక మరో ఒపెనర్‌ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కూడా దాటిగా ఆడాడు. వీరిద్దరూ కలిసి 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రభుసింగ్‌ 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 83 పరుగులు చేశాడు. వీరిద్దరూ పోటాపోటీగా ఫోర్లు, సిక్సర్ల రూపంలో పరుగులు రాబట్టారు. 

ఆ దశలో కరేబియన్‌ ఆండ్రూ రస్సెల్ ఓపెనర్ల భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. ప్రియాంశ్ ఆర్యను తొలుత అవుట్‌ చేశాడు. ప్రియాంశ్‌ అవుటైనప్పటికీ.. ప్రభుసింగ్‌ దాటిగానే ఆడి.. అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సెంచరీకు చేరువవుతున్న క్రమంలో వైభవ్ అరోరా 83 పరుగుల వద్ద అతన్ని ఔట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన మ్యాక్స్ వెల్ 7 పరుగులు, మార్కో జాన్సన్ 3 రన్స్‌ తో అవుటై నిరాశపరిచారు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25, జోస్ ఇంగ్లీష్ 11, చివరిలో వేగంగా పరుగులు రాబట్టడంతో ఆ జట్టు 200 మైలురాయిని చేరుకుంది. కేకేఆర్‌ జట్టు చివరి ఓవర్లలో పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో ఆ ఓవర్లలో తక్కువ పరుగులే ఇచ్చాడు. అండ్రు రసెల్‌ చివరి ఓవర్‌లో కేవలం 8 పరుగులే ఇచ్చాడు. ఇక అరోరాకు 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, రసెల్ చెరో వికెట్‌ తీసుకున్నారు. 


ఆ జట్టుకు ప్రయోజనం.. 
వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్‌ ఇచ్చారు. ఈ పాయింట్‌తో పంజాబ్‌ ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. టేబుల్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. కేకేఆర్ ఖాతాలో ఏడు పాయింట్లు చేరాయి. టేబుల్‌లో ఏడో స్థానంలో నిలిచింది. ఇక మ్యాచ్‌ రద్దు కావడంతో కేకేఆర్‌ ఒడిపోయే పరిస్థితి తప్పింది. ఒకవేళ ఓడిపోతే ఆ ఒక్క పాయింట్‌ కూడా వచ్చేది కాదు. ఈ అంశం కాస్త కేకేఆర్‌కు అనుకూలించిది అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి  ముందుకు వెళ్దామనుకున్న పంజాబ్‌కు నిరాశ మిగిలింది. అయితే కేకేఆర్‌ బ్యాటింగ్‌ పూర్తిగా చేయకముందే వర్షం కురవడం వల్ల ఎవరు గెలుస్తారో కూడా చెప్పలేని పరిస్థితి. రెండు జట్లకు ఎంతో కొంత వర్షం మేలు చేసినట్టే అని భావించవచ్చు.