INDvsENG: మూడో రోజు కూడా వర్షార్పణం... టీమిండియా స్కోరుకి 70 పరుగుల దూరంలో...
వర్షం కారణంగా ఆట నిలిపివేసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 11.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసిన ఇంగ్లాండ్...
నాటింగ్హమ్లో వరుసగా రెండో రోజు కూడా వర్షం కారణంగా పూర్తి ఆట సాధ్యం కాలేదు. తొలి ఇన్నింగ్స్లో అంతరాయం కలిగించిన వర్షం, మూడో సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే పలకరించింది. వర్షం కారణంగా ఆట నిలిపివేసే సమయానికి 11.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది ఇంగ్లాండ్...
టీమిండియా చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 70 పరుగుల దూరంలో ఉంది ఇంగ్లాండ్ జట్టు. వాతావరణం ఆటకు అనుకూలించే కనిపించకపోవడంతో ఆటను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు..
వర్షం కారణంగా వరుసగా రెండు రోజుల్లో మూడు సెషన్లకు పైగా ఆట రద్దు కావడంతో టెస్టు మ్యాచ్ ఫలితం తేలడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో రిజల్ట్ రావాలంటే మిగిలిన రెండు రోజులైనా ఆట సజావుగా సాగాల్సి ఉంటుంది...
అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 278 పరుగులకి ఆలౌట్ అయ్యింది. విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే వంటి టాపార్డర్ బ్యాట్స్మెన్ ఘోరంగా ఫెయిల్ అయినా కెఎల్ రాహుల్ 84, రవీంద్ర జడేజా 56, రోహిత్ శర్మ 36 పరుగులు చేసి ఆదుకున్నారు.
205 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా జడేజా, షమీ, బుమ్రా, సిరాజ్ కలిసి ఆఖరి మూడు వికెట్లకు 73 పరుగులు జోడించారు. బుమ్రా 34 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 28 పరుగులు చేసి బ్యాటుతోనూ ఆకట్టుకున్నాడు. బ్యాటుతో అదరగొట్టిన బుమ్రా, రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్లో మూడు నో బాల్స్, ఓ వైడ్ రూపంలో నాలుగు అదనపు పరుగులు ఇవ్వడం కొసమెరుపు.