టీ20ల్లో 8వ సెంచరీ బాదిన బాబర్ ఆజమ్... అయినా టీమ్ని గెలిపించలేకపోయిన పెషావర్ జెల్మీ కెప్టెన్! టీమ్ కంటే వ్యక్తిగత రికార్డులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడంటూ విమర్శించిన సైమన్ ధుల్...
కెఎల్ రాహుల్ ఏం చేసినా ట్రోల్స్ నుంచి తప్పించుకోలేడు. అలాగే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా అంతే! బాబర్ ఆజమ్ ఎంత బాగా ఆడినా అతనిపై వచ్చే ట్రోల్స్కి మాత్రం బ్రేకులు ఉండవు. ప్రస్తుతం పాక్ సూపర్ లీగ్లో పెషావర్ జెల్మీకి కెప్టెన్గా వ్యవహరిస్తున్న బాబర్ ఆజమ్, రికార్డు సెంచరీ నమోదు చేశాడు..
60 బంతుల్లో సెంచరీ బాదిన బాబర్ ఆజమ్, టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్గా రెండో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ టీ20 ఫార్మాట్లో 22 సెంచరీలు బాదగా మైకేల్ కింగ్లర్, డేవిడ్ వార్నర్ల రికార్డును సమం చేసిన బాబర్ ఆజమ్, 8 టీ20 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు..
బాబర్ ఆజమ్ సెంచరీ కారణంగా 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 240 పరుగుల భారీ స్కోరు చేసింది పెషావర్ జెల్మీ. సయిం అయూబ్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేయగా రోవ్మన్ పావెల్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. 65 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు చేసిన బాబర్ ఆజమ్ రనౌట్ అయ్యాడు...
బాబర్ ఆజమ్ 175+ స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేస్తే, పెషావర్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి వచ్చిన మిగిలిన ముగ్గురు 200లకు పైగా స్ట్రైయిక్ రేటుతో పరుగులు సాధించారు. 240 పరుగుల కొండంత లక్ష్యం చేస్తే, టీ20ల్లో ఛేదించడం కష్టమే. ఐపీఎల్లోనూ ఇంత భారీ టార్గెట్ని కొట్టిన సందర్భాలు లేవు.
అయితే తారు రోడ్డు లాంటి పాక్ పిచ్ మీద ఈ స్కోరు ఏ మాత్రం సరిపోలేదు. క్వెట్టా గ్లాడియేటర్స్ టీమ్ 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఊది పాడేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ 63 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 145 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా మార్టిన్ గుప్టిల్ 8 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 21 పరుగులు చేశాడు. విల్ సమీద్ 22 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి అవుట్ కాగా మహ్మద్ హఫీజ్ 18 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు..
బాబర్ ఆజమ్ సెంచరీపై సైమన్ ధుల్ తీవ్రంగా స్పందించాడు... ‘టీమ్ కంటే నీ సెంచరీ ముఖ్యమైంది. ఎప్పుడైనా సెంచరీ వంటి విషయాలకు ఆఖరి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఇక్కడ మాత్రం టీమ్కి ఆఖరి ప్రాధాన్యం దక్కుతోంది. బౌండరీలు కొట్టకుండా సెంచరీ పూర్తి చేసుకోవాలని చూస్తున్నాడు...
సెంచరీలు చేయడం గొప్ప విషయమే. గణాంకాలు చాలా పెద్ద విషయమే. అయితే అన్నింటికంటే ముందు టీమ్ ముఖ్యం. విజయాలే ప్రాధాన్యం...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ ధుల్...
ఇంతకుముందు కూడా బాబర్ ఆజమ్ని ఈ విధంగానే విమర్శించాడు సైమన్ ధుల్. ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య సిరీస్ సమయంలో పిచ్ గురించి చాలా పెద్ద చర్చ నడిచింది. ‘ఇలాంటి తారు రోడ్డు లాంటి పిచ్లను రూపొందించి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వాళ్ల కెప్టెన్ బాబర్ ఆజమ్ని ప్రపంచంలో గొప్ప బ్యాటర్గా చూపించాలని చూస్తోంది. ఇలాంటి పిచ్లపై డబుల్ సెంచరీలు చేసి, అతను తన గణాంకాలను గొప్పగా చేసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే దీని వల్ల టీమ్కి కానీ, క్రికెట్కి కానీ కలిగే ప్రయోజనం ఏంటి? విజయాలు లేకుండా కేవలం రికార్డులతో ఏం చేసుకుంటారు...’ అంటూ కామెంట్ చేశాడు సైమన్ ధుల్..
