ప్రో కబడ్డి సీజన్ 7 లో యూ ముంబా మరో ఓటమిని చవిచూసింది. హర్యానా  స్టీలర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై కేవలం 3 పాయింట్ల తేడాతో ఓటమిపాలయ్యింది.  

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7లో యూ ముంబా మరో ఓటమిని చవిచూసింది. చెన్నైలోని జవహార్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ జట్టు అదరగొట్టింది. స్టార్ రైడర్ వికాస్ ఖండోలా చెలరేగి 9 పాయింట్లతో ఆదుకోవడంతో హర్యానా విజయం సాధ్యమయ్యింది. కేవలం 3 పాయింట్లు తేడాతో ముంబైని మట్టికరిపించిన స్టీలర్స్ జట్టు పాయింట్స్ పట్టికలో ముందుకు దూసుకుపోయింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హర్యానా ఆటగాళ్ల వికాస్ ఒక్కడే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మిగతావాళ్లలో రవి కుమార్ 3, సునీల్ 3, చాంద్ సింగ్ 3, సెల్వమణి 3 పాయింట్లతో పరవాలేదనిపించారు. ఓ సూపర్ రైడ్ తో కలుపుకుని మొత్తం రైడింగ్ లో 17, ట్యాకిల్స్ లో 9, ప్రత్యర్థిని ఓసారి ఆలౌట్ చేయడం ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 3 ఇలా మొత్తం 30 పాయింట్లు సాధించింది.

ముంబై జట్టు చివరివరకు గట్టి పోటీనిచ్చినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ జట్టు రైడింగ్ లో 14, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ చేయడం ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో 1 పాయింట్లతో మొత్తంగా 27 పాయింట్లు సాధించింది. అయినప్పటికి కేవలం 3 పాయింట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 

ముంబై ఆటగాళ్లలో అభిషేక్ సింగ్ 6, సందీప్ నర్వాల్ 5, ఫజల్ 4 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఇక అర్జున్ 3, అతుల్ 3, హరీందర్ 2 పాయింట్లతో పరవాలేదనిపించారు. ఇలా ముంబై జట్టు చివరివరకు పోరాడినప్పటికి 30-27 పాయింట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.