T20 World Cup 2022: జింబాబ్వే - పాకిస్తాన్ మధ్య పెర్త్ లో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క పరుగు తేడాతో గెలిచిన ఆఫ్రికన్ జట్టు పోరాటంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
క్రికెట్ మ్యాచ్ లను స్టేడియాలలో లైవ్ గా చూస్తే ఎలాంటి థ్రిల్ కలుగుతుందో గానీ టీవీలలో లైవ్ చూడటం ద్వారా వచ్చే కిక్కే వేరు. వీడియోతో పాటు కామెంటేటర్లు తమ పదజాలంతో మ్యాచ్ ను మరింత ఆసక్తిని మారుస్తారు.సరైన కామెంటేటర్ తగలాలే గానీ సాధారణ మ్యాచ్ కూడా రసవత్తరంగా మార్చగల శక్తి వాళ్లకుంటుంది. భారత జట్టు ఆడే మ్యాచ్ లలో రవిశాస్త్రి, హార్షా భోగ్లే, విద్యుత్ శివరామకృష్ణన్, సంజయ్ మంజ్రేకర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ కామెంటేటర్లు చేసే మ్యాజిక్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తాజాగా జింబాబ్వే - పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఎంబంగ్వ చెప్పిన కామెంట్రీ కూడా ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గదు.
సాధారణంగా ఏ దేశం క్రికెట్ మ్యాచ్ ఆడితే ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు కామెంట్రీ చెప్పడం తెలిసిందే. జింబాబ్వే -పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ కామెంటేటర్ బాజిద్ ఖాన్, జింబాబ్వేకు చెందిన ఎంబంగ్వాలు కామెంట్రీ చెప్పారు.
మ్యాచ్ చివరి ఓవర్ లో అప్పటికే సాగిన హైడ్రామా అనంతరం చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి వచ్చింది. అప్పుడు కామెంట్రీ రూమ్ లో ఉన్న ఎంబంగ్వ తన సీట్లోంచి లేచి.. ‘ఎవిన్స్ చేతిలో బంతి. అఫ్రిది షాట్ ఆడాడు. ఒక్కటా..? రెండా..? అది కచ్చితంగా రెండు కాకూడదు.’ అని అనంగానే అఫ్రిదిని వికెట్ కీపర్ చకబ్వ రనౌట్ చేశాడు.
అప్పుడు చూడాలి ఎంబంగ్వను.. అతడి కామెంట్రీ ఇలా సాగింది.. ‘ఓ..! ఓ మ్యాన్..! ఓ మ్యాన్..! ఏం మ్యాచ్ ఇది. గుండెలు ఆపేసే విషయాలు నేను మీకు చెబుతున్నాను. జింబాబ్వేకు అత్యద్భుత విజయం. అసలు వారికి ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశమే లేదు. దాదాపు వాళ్ల పని అయిపోయింది. బహుశా వాళ్లు వాళ్ల ఇన్నింగ్స్ ముగిసిన తర్వాతే సగం చచ్చారు. కానీ వాళ్లు పోరాడారు. పెర్త్ లో బౌన్స్ ను ఉపయోగించుకున్న పొడవాటి పేసర్లు.. మధ్యలో రజా.. వాళ్లు పోరాడారు.. పోరాడారు.. చివరికి వాళ్లు విజయం సాధించారు..’ అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు.
బ్రాడ్ ఎవిన్స్ చివరి బంతిని వేయడం మొదలుపెట్టినప్పట్నుంచి అఫ్రిది పరుగు తీసి రెండో పరుగు కోసం యత్నించి రనౌట్ అయి.. జింబాబ్వే సంబురాలు చేసుకునేంత వరకూ ఎంబంగ్వ తన కామెంట్రీని చెబుతూనే ఉన్నాడు. ఊపిరి బిగపట్టి అతడు చెప్పిన ఈ కామెంట్రీకి సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియా ఖాతాలలో విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. ఇదిలాఉండగా ఎంబంగ్వ ఈ వ్యాఖ్యానం చేస్తున్నంతసేపూ పక్కనే ఉన్న పాకిస్తాన్ కామెంటేటర్ బాజిద్ ఖాన్ మొఖం పేలిపోయింది. తన దేశ ఓటమిని తట్టుకోలేక అతడు బిత్తిరి చూపులు చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు పక్కనే ఉన్న కామెంటేటర్ల దృష్టంతా మ్యాచ్ మీదికంటే ఎంబంగ్వ మీదే ఉంది.
జింబాబ్వేకు చెందిన ఎంబంగ్వ.. 1996 నుంచి 2002 వరకు జాతీయ జట్టు తరఫున ఆడాడు. జింబాబ్వే తరఫున 15 టెస్టులు, 29 వన్డేలలో ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత కామెంటేటర్ గా రాణిస్తున్నాడు. ఎంబంగ్వ చెప్పిన ఈ కామెంట్రీకి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇంగ్లీష్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్, టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా లైక్ చేయడం గమనార్హం.
