దయచేసి ఆర్చరీ గ్రౌండ్ను క్రికెట్ గ్రౌండ్గా మార్చకండి... గౌతమ్ గంభీర్కి షాక్ ఇచ్చిన దీపికా కుమారి...
యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్గా మారిందంటూ గౌతమ్ గంభీర్ ట్వీట్...
‘ఇది క్రికెట్ గ్రౌండ్ కాదు, ఆర్చరీ గ్రౌండ్... దయచేసి క్రికెట్ గ్రౌండ్గా మార్చకండి...’ అంటూ ఆర్చర్ దీపికా కుమారి ట్వీట్...
క్రికెట్ కోసం మిగిలిన క్రీడలను చంపేస్తున్నారంటూ నెటిజన్ల ఆందోళన... వివరణ ఇచ్చిన గంభీర్...
నిన్న మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు, సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్ మార్చి వార్తల్లో నిలిచిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్కి మరోసారి చుక్కెదురైంది. ఈస్ట్ ఢిల్లీలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో క్రికెట్ పోటీలు నిర్వహించబోతున్నామని తెలుపుతూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశాడు గౌతమ్ గంభీర్.
అయితే యమునా స్పోర్ట్స్ గ్రౌండ్ అధికారికంగా ఆర్చరీ గ్రౌండ్గా పరిగణించబడుతోంది. దీంతో ఆర్చరీ గ్రౌండ్ను క్రికెట్ గ్రౌండ్గా మార్చకండి అంటూ భారత ఆర్చర్ దీపికా కుమారి రిప్లై ఇచ్చింది.
‘నేను ఇదే గ్రౌండ్లో 2010 కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొని దీపికాగా మారాను. దయచేసి ఆర్చరీ గ్రౌండ్ను క్రికెట్ గ్రౌండ్గా మార్చకండి. ఇది ఆసియాలో ది బెస్ట్ ఆర్చరీ గ్రౌండ్లలలో ఒకటి. ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్చరీ టోర్నమెంట్లు జరుగుతాయి..’ అంటూ భారత ప్రధాని ఆఫీసుతో మాజీ క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు, నూతన క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్చరీ కోచ్ లోకేశ్ చంద్లను ట్యాగ్ చేసింది.
దీపికా కుమారి ట్యాగ్తో అప్పటిదాకా క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారంటూ గౌతమ్ గంభీర్ను పొడిగిన నెటిజన్లు, క్రికెట్ కోసం మిగిలిన క్రీడలను చంపకండి అంటూ విమర్శిస్తూ కామెంట్లు చేయడం మొదలెట్టారు. దీంతో మరోసారి ఈ ఇష్యూపై స్పందించాడు గౌతమ్ గంభీర్...
‘నేను దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా.. యమునా స్పోర్ట్స్ గ్రౌండ్ను క్రికెట్ గ్రౌండ్గా మార్చలేదు. కేవలం అప్గ్రేడ్ చేశాం. ఇందులో ఆర్చరీతో పాటు క్రికెట్, ఇతర క్రీడా పోటీలు కూడా నిర్వహించవచ్చు. ఓ క్రీడాకారుడిగా ఏ క్రీడాకారుడి అభివృద్ధికి అవరోధంగా మారే పనులను నేను ప్రోత్సహించను’ అంటూ మరో ట్వీట్ చేశాడు గంభీర్..