భారతీయ జర్నలిస్టుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ అనుచిత ప్రవర్తన.. వీడియో వైరల్
Asia Cup 2022 Final: ఆసియా కప్ లో లంక చేతిలో ఓడిపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ రమీజ్ రాజా సహనం కోల్పోయాడు. భారతీయ జర్నలిస్టుపై అతడి ప్రవర్తన చర్చనీయాంశమైంది.
ఆసియా కప్-2022లో శ్రీలంక చేతిలో ఓడినందుకు గాను పాకిస్తాన్ కు దిమ్మతిరిగింది. ఫైనల్ లో పాకిస్తాన్.. 23 పరుగుల తేడాతో ఓడింది. అయితే తాజాగా తమ జట్టు ఓటమిపై ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మెన్ రమీజ్ రాజా వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. తాజాగా అతడు.. ఫైనల్ మ్యాచ్ ముగిశాక భారతీయ జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించాడు. అతడికి సమాధానం చెప్పలేక.. ‘నువ్వు ఇండియా జర్నలిస్టువా..?’ అని అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయాడు.
ఆసియా కప్ ఫైనల్ చూడటానికి రమీజ్ రాజా కూడా దుబాయ్ కు వచ్చాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ లో మ్యాచ్ ముగిసిన తర్వాత అతడికి బయిటకు వచ్చాక విలేకరుల నుంచి ప్రశ్నల వర్షం ఎదురైంది. కానీ అప్పటికే పాక్ ఓటమితో ఉన్న రమీజ్ రాజా వారికి సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి జారుకోవాలని చూశాడు.
ఆ క్రమంలో ఓ జర్నలిస్టు.. ‘పాకిస్తాన్ లో ప్రజలు ఈ ఓటమితో బాధపడుతున్నారా..?’ అని ప్రశ్నించాడు. దానికి రమీజ్ రాజా స్పందిస్తూ.. ‘నువ్వు తప్పకుండా ఇండియా నుంచే అయి ఉంటావ్. మేం మ్యాచ్ ఓడిపోతే నువ్వు హ్యాప్పీయేనా..?’ అని సదరు జర్నలిస్టుతో అన్నాడు. అక్కడితో ఆగకుండా జర్నలిస్టు చేతిలో ఉన్న ఫోన్ ను చేతితో లాగాడు. ఇంక తననెవరూ ఏ ప్రశ్న వేయకుండా అక్కడ్నుంచి జారుకున్నాడు. వెళ్తున్న క్రమంలో జర్నలిస్టు ఫోనును అతడి చేతిలోనే పెడుతూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
రాజా చేసిన ఈ పనితో సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. రమీజ్ రాజా ముందు సహనంగా ఉండటం నేర్చుకోవాలని వాళ్లు సూచిస్తున్నారు. సదరు జర్నలిస్టు తప్పుగా ఏమీ అడగలేదని.. అంతమాత్రానికే రమీజ్ రాజా అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఉన్నమాట అంటే రమీజ్ రాజాకు ఉలుకెందుకని ప్రశ్నిస్తున్నారు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భానుక రాజపక్స 71 పరుగులతో నాటౌట్ గా నిలిచి లంకకు భారీ స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం పాకిస్తాన్.. 20 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా శ్రీలంక 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో లంక.. ఆరోసారి ఆసియా కప్ ను గెలుచుకుంది.