IND vs PAK T20 World Cup 2024 : మారో... ముజే మారో... పాక్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మామూలుగా లేదుగా...
పసికకూన అమెరికా చేతిలో ఓటమిని సైతం జీర్ణించుకున్నారు... కానీ చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓటమిని మాత్రం తట్టుకోలేకపోతున్నారు పాకిస్థాన్ ఫ్యాన్స్. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో ఓడిన పాక్ పై ఫ్యాన్స్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
![Pakistan team Roasted after loss to India in T20 World Cup AKP Pakistan team Roasted after loss to India in T20 World Cup AKP](https://static-ai.asianetnews.com/images/01j008qw0z482y6dak8k4cqzqv/pak_363x203xt.jpg)
INDIA vs Pakistan : టీ20 ఫార్మాట్ లో 120 పరుగుల లక్ష్యం అంటే చాలా చిన్నది... దాన్ని కూడా చేధించలేక చతికిలపడింది పాకిస్థాన్ జట్టు. టీ20 ప్రపంచకప్ 2024 లో దాయాది పాకిస్థాన్ ను మట్టికరిపించి అద్భుత విజయాన్ని అందుకుంది భారత్. ముఖ్యంగా భారత బౌలర్ల దాటికి పాక్ బ్యాటర్లు నిలవలేకపోయారు... దీంతో తక్కువ స్కోరును కాపాడుకుని మరీ టీమిండియా విజయం సాధించింది.
దాయాదులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. అలాంటింది వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఇరుదేశాలు తలపడుతుంటే ఫ్యాన్స్ సందడి మామూలుగా వుండదు. రెండు దేశాల అభిమానులు ఎవరి టీంకు వారు మద్దతుగా నిలుస్తారు. ఇలా నిన్న అమెరికాలోని న్యూయార్క్ వేదికన భారత్, పాక్ మధ్య టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుత విజయాన్ని అందుకుంది. లో స్కోరింగ్ మ్యాచ్ లో భారత బౌలర్లు మాయ చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.
భారత్, పాకిస్థాన్ తో పాటు అమెరికా, కెనడా, ఐర్లాండ్ జట్లు గ్రూప్-ఏ లో వున్నాయి. అయితే ఇప్పటికే ఆతిథ్య అమెరికా చేతిలో ఓడిన పాక్ రెండో మ్యాచ్ భారత్ తో తలపడింది. కానీ ఎప్పటిలాగే టీమిండియా చేతిలో మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పాక్ ఈజీగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ ను భారత బౌలర్లు మలుపుతిప్పారు. బుల్లెట్ లాంటి బంతులను మన బౌలర్లు సంధించడంతో పాక్ బ్యాటర్ల విలవిల్లాడిపోోయారు... ఇలా క్రీజులో అడుగుపెట్టి అలా వెనుదిరిగారు. చివరి ఓవర్ వరకు థ్రిల్లింగ్ గా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు విజయం భారత్ నే వరించింది.
టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న పాక్ టీమిండియాను ముప్పుతిప్పులు పెట్టారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో కూడిన భారత టాప్ ఆర్డర్ ను పాక్ బౌలర్లు పేకమేడలా కూల్చేసారు. దీంతో కేవలం 119 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయ్యింది. దీంతో ఇక విజయం పాకిస్థాన్ దే అని ఫ్యాన్స్ సంబరాలకు సిద్దమయ్యారు. కానీ వారికి తెలియదు అసలు సినిమా ముందుందని.
పాక్ బౌలర్ల కంటే మెరుగైన ప్రదర్శన చేసారు భారత్ బౌలర్లు. ముఖ్యంగా స్టార్ బౌలర్ జస్ప్రిత్ సింగ్ బుమ్రా మరోసారి తన విశ్వరూపం చూపించాడు... 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడికి మిగతా బౌలర్లు కూడా తోడయ్యారు...దీంతో పాకిస్థాన్ చేతులెత్తేసింది. నిర్ణీత ఓవర్లలో కేవలం 113 పరుగులకే పాక్ పరిమితం కావడంతో టీమిండియా విజయం సాధించింది.
అయితే మొదటి ఇన్సింగ్ ముగియగానే పాక్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. టార్గెట్ కేవలం 120 పరుగులే కాబట్టి తామే గెలుస్తామన్న ధీమాతో వున్న వారికి షాక్ తగిలింది. చివరకు ఆరు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడంతో పాక్ ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. ఈజీగా గెలిచే మ్యాచ్ లో పాక్ ఓడిపోడానికి బ్యాటర్లే కారణమని... వారి చెత్త ప్రదర్శనతోనే ఫలితం మారిందని అంటున్నారు.
టీ20 వరల్డ్ కప్ లో భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్ జట్టుపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పాక్ ఆటగాళ్లపై ట్రోల్స్ మొదలయ్యాయి. పాక్ ఓటమిపై ఆ దేశ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇలా భారత్ చేతిలో ఓడిన పాకిస్ధాన్ ను సొంత అభిమానులే వివిధ రూపాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.