Pakistan quadrangular T20I Tournament: క్రికెట్ లో చిరకాల ప్రత్యర్థులైన  భారత్-పాకిస్థాన్, ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ లు కలిసి టీ20 టోర్నీ ఆడితే  చూడాలని  అభిమానులకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ సిరీస్ ను ప్రతిపాదించిన  పీసీబీ.. దీనిపై భారీ ఆశలు పెట్టుకుంది. 

‘ఆలూ లేదు చూలు లేదు అల్లుడి నోట్లో...’ అన్నట్టు ఉంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరు. గతంలో అది ప్రతిపాదించిన నాలుగు దేశాల (ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్) టీ20 టోర్నీకి సంబంధించిన ప్రతిపాదనపై సభ్యదేశాలు ఇంతవరకు ఎటువంటి అంగీకారం తెలుపకున్నా పాక్ మాత్రం ఇప్పుడే ఆదాయంపై లెక్కలేసుకుంటున్నది. ఈ నాలుగు దేశాలతో టీ20 టోర్నీని నిర్వహిస్తే అది బంపర్ హిట్ అవుతుందని, తద్వారా వచ్చిన ఆదాయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తో పాటు నాలుగు దేశాల బోర్డులు పంచుకోవచ్చని ఆయా దేశాల ముందు సరికొత్త ప్రతిపాదనలను నిలపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత జనవరిలో ఈ సిరీస్ నిర్వహణ గురించి ప్రతిపాదన పెట్టిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మెన్ రమీజ్ రాజా.. ఇప్పుడు దీనికి ఆదాయాన్ని లెక్కగట్టాడు. ఈ సిరీస్ ను నిర్వహించడం వల్ల రమారమి USD 650 million ల ఆదాయం చేకూరుతుందని అంచనాలు లెక్కగడుతున్నాడు. ఈ సిరీస్ నిర్వహణ తటస్థ వేదికలపై జరపడానికి ప్రతిపాదించిన పీసీబీ.. దీనిపై సంపూర్ణ ఆధిపత్యం ఐసీసీదే ఉంటుందని తెలిపింది. 

ఈ సిరీస్ నిర్వహణకు సంబంధించిన బ్లూప్రింట్ ను ఇప్పటికే తయారుచేసిన పీసీబీ.. ఇప్పటికే దానిని ఐసీసీ పాలక మండలికి పంపింది. దుబాయ్ లో వచ్చే వారం ఐసీసీ పాలక మండలిలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశముంది. ఐసీసీని ఎలాగైనా ఒప్పించి ఈ సిరీస్ ను నిర్వహించాలని పీసీబీ ఆశిస్తున్నది. ప్రతి ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మాసాలలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇండియా, ఇంగ్లాండ్ లతో కలిసి నాలుగు దేశాల టీ20 సిరీస్ ను నిర్వహించాలని పీసీబీ ప్రతిపాదించింది. 

Scroll to load tweet…

ఇక ఈ సిరీస్ ను నిర్వహించడం వల్ల వచ్చే ఆదాయాలు నాలుగు దేశాలు పంచుకోవడమే గాక.. తద్వారా యువ క్రికెటర్లకు ఎంతో స్పూర్తినిచ్చినట్టు అవుతుందని కూడా పాక్ చెప్పుకొస్తున్నది. ఆరు లీగ్ మ్యాచులు, ఆ పై ఫైనల్ ఉండే విధంగా టోర్నీని నిర్వహించేందుకు కూడా పీసీబీ షెడ్యూల్ ను డిజైన్ చేసింది. 

అయితే ఈ సిరీస్ నిర్వహణపై గతంలో బీసీసీఐ సెక్రెటరీ జై షా స్పందిస్తూ.. తాత్కాలిక ఆదాయాల మీద తమకు పెద్దగా నమ్మకం లేదని చెప్పిన విషయం తెలిసిందే. కాగా.. ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా.. ఈ సిరీస్ నిర్వహణకు సానకూలంగానే స్పందించింది. మరి వచ్చేవారం ఐసీసీ పాలకమండలి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.