INDW vs PAKW: పాక్ చేతిలో దారుణ పరాజయం.. ఆసియా కప్లో టీమిండియాకు తొలి ఓటమి..
INDW vs PAKW: మహిళల ఆసియా కప్ లో భాగంగా షిల్హెట్ లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ కు దారుణ పరాజయం ఎదురైంది. పాక్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కూడా భారత్ చేధించలేకపోయింది.
బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ లో భారత్ కు భారీ షాక్ తాకింది. వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన భారత జట్టు జోరుకు బ్రేకులు వేస్తూ పాకిస్తాన్.. భారత్ ను ఓడించింది. గ్రూప్ స్టేజ్ లో భాగంగా షిల్హెట్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ముగిసిన మ్యాచ్ లో పాకిస్తాన్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా.. 124 పరుగులకే ఆలౌటైంది. భారత టాపార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. టీ20లలో భారత్ పై పాకిస్తాన్ కు ఇది మూడో విజయం కావడం గమనార్హం. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడు విజయాల తర్వాత భారత్ కు ఇది తొలి ఓటమి.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మా మరూఫ్ (32) రాణించగా.. నిదా దార్ (37 బంతుల్లో 56 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడింది.
అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ దారుణంగా విఫలమైంది. ఈ టోర్నీలో ఫామ్ లో ఉన్న సబ్బినేని మేఘన (15) తో పాటు స్మృతి మంధాన (17), జెమీమా రోడ్రిగ్స్ (2), పూజా వస్త్రకార్ (5), దీప్తి శర్మ (16)లతో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (12) కూడా విఫలమయ్యారు. హేమలత (20) కాసేపు ప్రయత్నించినా ఆమె కూడా త్వరగానే నిష్క్రమించింది. చివర్లో వికెట్ కీపర్ రిచా ఘోష్ (13 బంతుల్లో 26, 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడినా 18 ఓవర్లో 3 బంతికి ఆమెను నష్రా సంధు ఔట్ చేసింది. దీంతో భారత ఓటమి ఖరారైంది. చివరికి పాకిస్తాన్.. 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పాక్ బౌలర్లలో నష్రా సంధు 3 వికెట్లు తీయగా నిదా దార్, సదియా ఇక్బాల్ తలా రెండు వికెట్లు తీశారు. అన్వర్, హసన్ లు చెరో వికెట్ పడగొట్టారు. టీ20 ఫార్మాట్ లో పాక్ చేతిలో భారత్ ఓడిపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇక ఆసియా కప్ లో వరుసగా శ్రీలంక, మలేషియా, యూఏఈల మీద గెలిచిన భారత్ కు ఇది తొలి పరాజయం. హర్మన్ ప్రీత్ సేన తమ తదుపరి మ్యాచ్ ను ఈనెల 15న బంగ్లాదేశ్ తో ఆడనుంది.