కేవలం క్రికెట్ కోసమే... కశ్మీర్ కోసం కాదు: పాక్ కోచ్ మిస్బా
కశ్మీర్ అంశంపై ఇటీవలే పాకిస్థాన్ టీం చీఫ్ కోచ్, చీప్ సెలెక్టర్ గా నియమితులైన మిస్బావుల్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా కాకున్నా కశ్మీర్ అంశం గురించి మాట్లాడే క్రికెటర్లకు అతడు చురకలు అంటించాడు.
భారత్, పాకిస్థాన్ ల మధ్య ఎప్పటినుండో వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక హక్కులు కల్పించే 370, 35ఎ ఆర్టికల్స్ ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పరిస్థితులు ఎక్కువయ్యాయి. భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని మరీ కశ్మీర్ విభజనను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం పాక్ ప్రభుత్వం చేసింది. అందుకు అక్కడి ప్రజలతో పాటు మాజీ, తాజా క్రికెటర్లు మద్దతుగా నిలిచారు.
అయితే ఈ కశ్మీర్ అంశంపై ఇటీవలే పాకిస్థాన్ టీం చీఫ్ కోచ్, చీప్ సెలెక్టర్ గా నియమితులైన మిస్బావుల్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా కాకున్నా కశ్మీర్ అంశం గురించి మాట్లాడే క్రికెటర్లకు అతడు చురకలు అంటించాడు. ఎక్కడ...ఎప్పుడూ...ఏం మాట్లాడాలో తెలియాలని... అది తెలుసుకోవాలంటూ మీడియా ప్రతినిధిపై కూడా మిస్బా కాస్త గరం అయ్యారు.
మిస్బా కోచ్, సెలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీలంకతో పాక్ మొదటి సీరిస్ ఆడుతోంది. దీంతో ఈ సీరిస్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునేందుకు మిస్బా మీడియా సమావేశం నిర్వహించాడు. అయితే ఇందులో పాల్గొన్న ఓ విలేకరి కశ్మీర్ అంశంపై ఓ ప్రశ్నను సంధించింది. దీంతో ఒకింత అసహనానికి గురయిన అతడు స్టన్నింగ్ రిప్లై ఇచ్చాడు.
''ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తోంది కేవలం క్రికెట్ గురించి మాత్రమే. చాలాకాలం తర్వాత మన జట్టు సొంతగడ్డపై ఆడుతోంది. ఆ విషయాలను వదిలిపెట్టి ఇలాంటి ప్రశ్న అడగాలని ఎలా అనిపించింది. కశ్మీర్ ప్రజలు బావుండాలని యావత్ పాకిస్థాన్ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం కేవలం క్రికెట్ గురించే మాట్లాడుకుందాం. అదే మనకు ముఖ్యం.'' అని మిస్బా సమాధానమిచ్చాడు.