ధోనీ నాయకత్వంలో 2011లో వన్డే వరల్డ్‌కప్ విజయానికి పదేళ్లు...సచిన్ టెండూల్కర్‌, వరల్డ్‌కప్‌ కల సాకారమైన రోజు...యావత్ భారతం సంబరాల్లో మునిగితేలిన రోజు...

పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు... మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు, వన్డే వరల్డ్‌కప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. 2003లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో వరల్డ్‌కప్ ఫైనల్‌లో బోల్తాపడిన టీమిండియా, 2011లో మాత్రం అంచనాలకు తగ్గట్టు అదరగొట్టి, రెండో ప్రపంచకప్ కైవసం చేసుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఏప్రిల్ 2, 2011న ముంబైలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది భారత జట్టు... మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. మహేళ జయవర్థనే సెంచరీతో అజేయంగా నిలవగా కుమార సంగర్కర 48 పరుగులు చేశాడు.

లక్ష్యచేధనలో వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ కావడం, సచిన్ టెండూల్కర్ 18 పరుగులు చేసి అవుట్ కావడంతో 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. అయితే విరాట్ కోహ్లీ 35, గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేయగా మహేంద్ర సింగ్ ధోనీ 91, యువరాజ్ 21 పరుగులు చేసి విజయాన్ని ముగించారు. మ్యాచ్‌ను ముగిస్తూ ధోనీ కొట్టిన సిక్సర్‌కి యావత్ భారతం ఫిదా అయిపోయింది...