ICC Meeting For 4 Nations T20 Series: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతిపాదించిన  నాలుగు దేశాల (క్వాడ్రాంగ్యులర్)  టీ20 సిరీస్ కోసం  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దుబాయ్ లో సమావేశమైంది. 

పాకిస్థాన్ బోర్డు ప్రతిపాదించిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్థాన్ దేశాల టీ20 సిరీస్ తో పాటు పలు విషయాల మీద చర్చించడానికి ఐసీసీ పాలక మండలి దుబాయ్ లో సమావేశమైంది. అయితే ఒక్క పీసీబీనే కాదు.. ఇప్పుడు దానికి తోడుగా మరో రెండు దేశాల బోర్డులు కూడా ఇదే తరహా సిరీస్ లను నిర్వహించాలని ఐసీసీని కోరుతున్నాయట. ఆ రెండే.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తో పాటు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ). ఈ రెండు దేశాల బోర్డులు కూడా తాము నాలుగు దేశాల టీ20 సిరీస్ లను నిర్వహించేందుకు ప్రణాళికల సిద్ధం చేసినట్లు ఐసీసీ ముందుంచాయి. 

ఈసీబీ, సీడబ్ల్యూఐ తాజా ప్రతిపాదనలతో ఐసీసీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. పీసీబీ ప్రతిపాదించిన విషయమై చర్చిద్దామని సమావేశం ఏర్పాటు చేస్తే ఇప్పుడు తాజాగా మరో రెండు దేశాల బోర్డులు కూడా అదే ప్రతిపాదనతో ముందుకు రావడంతో ఐసీసీ తలలు పట్టుకుంటున్నది. 

Scroll to load tweet…

ఇక పీసీబీ ప్రతిపాదన గురించి ఆదివారం సాయంత్ర రమీజ్ రాజా.. ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఐసీసీ ముందుంచనున్నాడు. ఈ ప్రతిపాదన ద్వారా బోర్డులకు ఆదాయం తో పాటు ప్రేక్షకులకు అమితమైన వినోదం కూడా అందుతుందని పీసీబీ పేర్కొంది. తటస్థ వేదికల మీద ఈ సిరీస్ నిర్వహణకు అవకాశమిచ్చి.. లీగ్, ఫైనల్స్ మాదిరిగా దీనిని నిర్వహించాలని పీసీబీ ప్రతిపాదనలో పొందుపరిచింది. 

అయితే రమీజ్ రాజా ప్రతిపాదన కంటే ముందే ఈసీబీ సీఈవో టామ్ హరిసన్ తో పాటు సీడబ్ల్యూఐ కూడా ఐసీసీ ముందు తమ అభ్యర్థనలను ఉంచినట్టు తెలుస్తున్నది. మరి ఈ రెండు దేశాల బోర్డులు ఏ నాలుగు దేశాలతో సిరీస్ నిర్వహించేది మాత్రం వెల్లడించలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం మూడు దేశాల సిరీస్ (ట్రిబుల్) లకు ఓకే చెప్పిందే తప్ప నాలుగు దేశాలపై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. ఒకవేళ పాక్ ప్రతిపాదనకు ఐసీసీ ఓకే చెప్పి.. ఆ తర్వాత బోర్డులను ఒప్పిస్తే మాత్రం ఇక ద్వైపాక్షిక (రెండు దేశాల) సిరీస్ లకు స్వస్తి చెప్పి క్వాడ్రాంగ్యులర్ సిరీస్ లదే హవా కానున్నదని క్రికెట్ విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఐసీసీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారరో వేచి చూడాల్సిందే.