Saha-Journalist Row: గత నాలుగైదు రోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఎట్టకేలకు మౌనం వీడాడు. తనను బెదిరించిన జర్నిలిస్టు పేరును కావాలనే...
భారత క్రికెట్ లో కొత్త చర్చకు తెరతీసిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా - జర్నలిస్టు వివాదంపై స్వయంగా సాహానే స్పందించాడు. ఈ వివాదంపై నాలుగైదు రోజులుగా భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో సాహా మౌనం వీడాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ కు సెలెక్టర్లు తనను పక్కనబెట్టడాన్ని నిరసిస్తూ.. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు సాహా.. దాంతోపాటు ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్టు తనను బెదిరించిన విషయాన్ని కూడా ట్విట్టర్ లో పంచుకోవడంతో సాహా.. నాలుగైదు రోజులుగా వార్తల్లో వ్యక్తయ్యాడు.
చర్చోపచర్చల అనంతరం ఈ వివాదంపై సాహా మౌనాన్ని వీడాడు. ఓ జాతీయ మీడియాతో సాహా మాట్లాడుతూ.. ‘బీసీసీఐ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు. ఒకవేళ వాళ్లు అడిగితే ఆ జర్నలిస్టు పేరు కచ్చితంగా చెబుతా.. నిజానికి ఒక వ్యక్తి ప్రతిష్టను దిగజార్చడం.. అభాసుపాలు చేయడం, అతడి కెరీర్ ను ఇబ్బందుల్లోకి నెట్టడం నాకు తెలియని పనులు. అవి నాకు నచ్చవు.
ఇతరలకు హాని చేయాలన్న ఆలోచన నాకు ఉండదు. నా తల్లిదండ్రులు నాకు నేర్పింది కూడా అదే. అందుకే నేను చేసిన ట్వీట్ లో కూడా అతడి (జర్నలిస్టు) పేరును వెల్లడించలేదు. అయితే మీడియాలో కొంతమంది వ్యక్తులు ఆటగాళ్లను ఎలా అగౌరవపరుస్తారో బయట ప్రపంచానికి తెలియజెప్పేందుకే నేను ఆ ట్వీట్ చేశాను...’ అని అన్నాడు.
అంతేగాక.. ఈ పని ఎవరు చేశారో వాళ్లకు బాగా తెలుసునని, తన లాగా ఇతర ఆటగాళ్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే అలా చేశానని సాహా చెప్పుకొచ్చాడు. ఇది తప్పు, మిగతా వాళ్లు కూడా ఇలా చేయకూడదని చెప్పేందుకే ఇలా చేశానని సాహా అన్నాడు.
రెండ్రోజుల క్రితం సాహా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇన్నాళ్లు భారత క్రికెట్ కు సేవ చేసినందుకు గాను ఓ పేరు మోసిన జర్నలిస్టు నుంచి నాకు దక్కుతున్న గౌరవమిది.. జర్నలిజం విలువలు ఎక్కడికి పడిపోయాయో అనేదానికి ఇది నిదర్శనం..’ అని ట్వీట్ చేశాడు. తనతో ఇంటర్వ్యూ చేయనందుకు సాహాను ఓ జర్నలిస్టు బెదిరించిన వైనాన్ని సాహా బహిర్గతం చేశాడు. కానీ అతడి పేరును మాత్రం వెల్లడించలేదు. దీంతో సాహా కు టీమిండియా సీనియర్ల నుంచి మద్దతు దక్కింది. బీసీసీఐ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. సదరు జర్నలిస్టు పేరు చెప్పాలని సాహాను కోరతామని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాతో అన్నాడు. సాహాకు జర్నలిస్టు నుంచి బెదిరింపులు వచ్చిన అనంతరం బీసీసీఐ కూడా మీడియాకు కొత్త గైడ్ లైన్స్ ను ప్రతిపాదిస్తున్నది.
