ప్రపంచ కప్ పై బిసిసిఐ నిర్ణయం.... కోహ్లీ, రవిశాస్త్రిలకు ఊరట
ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ నుండి టీమిండియా అర్థాంతరంగా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే గతంలో దీనిపై సమీక్ష చేపట్టునున్నట్లు ప్రకటించిన సీఓఏ తాజాగా ఆ పని చేయడం లేదని ప్రకటించింది.
ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసినా తుదివరకు నిలవలేకపోయింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై ప్రపంచ కప్ నుండి అర్థాంతరంగా నిష్క్రమించింది. అయితే ఇలా ఎన్నో అంచనాలతో ఇంగ్లాండ్ లో అడుగుపెట్టిన కోహ్లీసేన ఉట్టిచేతులతోనే ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో జట్టు ఓటమికి గల కారణాలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రిల నుండి వివరణ కోరనున్నట్లు బిసిసిఐ తెలిపింది. అందుకోసం ఓ సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పాలకుల కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ప్రపంచ కప్ ముగిసి టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరి దాదాపు రెండువారాలు అవుతోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి సమీక్షా సమావేశం గానీ... కోహ్లీ, రవిశాస్త్రిల నుండి విరవణ కోరడం గానీ జరగలేదు. అయితే ఇప్పుడు టీమిండియా వెస్టిండిస్ పర్యటన కోసం వెళుతోంది. జట్టుతో పాటే కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి కూడా వెళ్లనున్నారు. కాబట్టి ఇక ప్రపంచ కప్ వైఫల్యంపై సమీక్ష నిర్వహించే అవకాశమే లేదు. ఇదే అభిప్రాయాన్ని సీఓఏ( కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్) చీఫ్ వినోద్ రాయ్ వ్యక్తం చేశారు.
''ప్రపంచ కప్ లో టీమిండియా ఓటమికి గల కారణాలు తెలుసుకునేందుకు సమీక్ష నిర్వహించాలని అనుకున్న మాట నిజమే. కానీ వివిధ కారణాలతో ఆ పని చేయలేకపోయాం. ఇప్పుడు చేద్దామనుకున్నా కోహ్లీ, రవిశాస్త్రిలు విండీస్ టూర్ కు వెళుతున్నారు. అలాగే ఇంకా టీమిండియా సహాయక సిబ్బంది, మేనేజర్ల నుండి ప్రపంచ కప్ కు సంబంధించిన పూర్తి వివరాలు అందలేవు. కాబట్టి ఇప్పట్లో ఆ సమీక్ష వుండబోదు.'' అని రాయ్ వెల్లడించారు. దీంతో కోహ్లీ, రవిశాస్త్రిలకు ఊరట లభించింది.