మిమ్మల్ని ఓడించడానికి ప్రపంచ స్థాయి ఆటగాళ్లెందుకు..? బంగ్లాదేశ్కు శ్రీలంక స్పిన్నర్ అదిరిపోయే కౌంటర్
Asia Cup 2022: ఆసియా కప్- 2022లో భాగంగా గురువారం శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య దుబాయ్ వేదికగా ముగిసిన ఉత్కంఠభరితపోరులో లంక 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య గురువారం దుబాయ్ వేదికగా ముగిసిన మ్యాచ్లో చివరికి లంకనే విజయం విరించింది. అభిమానులకు కావల్సినంత టీ20 మజాను పంచిన ఈ మ్యాచ్ లో గెలిచిన లంక సూపర్-4కు అర్హత సాధించగా.. బంగ్లాదేశ్ ఇంటికి పయనమైంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్లు మాటల యుద్ధానికి దిగాయి. బంగ్లాదేశ్ లో ఇద్దరు ప్రపంచస్థాయి బౌలర్లు ఉన్నారని లంక కెప్టెన్ అనగా.. మీ జట్టులో వాళ్లు కూడా లేరని బంగ్లా బదులిచ్చింది. ఇప్పుడు దీనికి కొనసాగింపా..? అన్నట్టుగా లంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.
అసలు విసయానికొస్తే.. శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ కు ముందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో లంక సారథి దసున్ శనక విలేకరులతో మాట్లాడుతూ.. ‘బంగ్లా జట్టులో ముస్తాఫిజుర్, షకిబ్ అల్ హసన్ మాత్రమే ప్రపంచ స్థాయి బౌలర్లు. వాళ్లిద్దరినీ అడ్డుకుంటే చాలు..’ అని కామెంట్స్ చేశాడు.
దీనికి బంగ్లా టీమ్ డైరెక్టర్ ఖలీల్ మహ్మద్ స్పందిస్తూ.. ‘దసున్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడో నాకు తెలియదు. అతడు చెప్పినట్టు మాకు ఇద్దరు ప్రపంచ స్థాయి బౌలర్లున్నారు. దానిని మేం ఒప్పుకుంటాం. కానీ శ్రీలంకలో నాకు ఒక్కరు కూడా (ప్రపంచ స్థాయి బౌలర్) కనబడలేదు..’ అని కౌంటర్ ఇచ్చాడు. అంతేగాక ఇది మాటల యుద్ధం కాదని.. గ్రౌండ్ లో ఎవరు బాగా ఆడితే వాళ్లు విజయం సాధిస్తారని శనకకు హితబోధ చేశాడు. శనకతో పాటు ఖలీల్ వ్యాఖ్యలు కూడా మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
ఇక గురువారం రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లంక.. 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం లంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ తన ట్విటర్ ఖాతాలో తమ జట్టు విజయానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. ఫోటోలను షేర్ చేస్తూ.. ‘మీకు కలిసికట్టుగా ఆడే 11 మంది సోదరులు ఉన్నప్పుడు ప్రపంచస్థాయి ఆటగాళ్లు అక్కర్లేదు..’ అని ట్వీట్ చేశాడు. ఇతర విషయాలేవీ వెల్లడించకున్నా తీక్షణ టార్గెట్ చేసింది బంగ్లాదేశ్ నే అనేది బహిరంగ రహస్యమే. తీక్షణ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.