కేన్ మామ కెప్టెన్ ఇన్నింగ్స్, టామ్ లాథమ్ శతక కొట్టుడు... తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం...
తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న న్యూజిలాండ్... భారీ సెంచరీ చేసిన టామ్ లాథమ్... 94 పరుగులతో కేన్ విలియంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్...
టీ20 సిరీస్ని కోల్పోయిన న్యూజిలాండ్, వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. తొలి వన్డేలో 307 పరుగుల భారీ టార్గెట్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది కివీస్. భారీ టార్గెట్తో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్, 88 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ కేన్ విలియంసన్, వికెట్ కీపర్ టామ్ లాథమ్ కలిసి నాలుగో వికెట్కి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఘన విజయం అందించారు...
ఈ ఇద్దరూ నాలుగో వికెట్కి 221 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వన్డేల్లో టీమిండియాపై న్యూజిలాండ్కి ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు 2017లో రాస్ టేలర్ - టామ్ లాథమ్ కలిసి జోడించి 200 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశారు టామ్ లాథమ్- కేన్ విలియంసన్..
అంతేకాకుండా టీమిండియాపై ఓవరాల్గా ఇదే అత్యధిక నాలుగో వికెట్ భాగస్వామ్యం. ఇంతకుముందు 2009లో మహ్మద్ యూసఫ్- షోయబ్ మాలిక్ జోడించిన 206 పరుగుల రికార్డును కూడా తుడిచి పెట్టేసింది కేన్ మామ- టామ్ లాథమ్ జోడి. కేన్ విలియంసన్ 98 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్తో 94 పరుగులు చేయగా టామ్ లాథమ్ 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 145 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...
47.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన కివీస్, మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు 25 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 22 పరుగులు చేసిన ఫిన్ ఆలెన్ని శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. 35 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్. 42 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసిన డివాన్ కాన్వేని ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత 16 బంతుల్లో ఓ సిక్సర్తో 11 పరుగులు చేసిన డార్ల్ మిచెల్ కూడా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లోనే పెవిలియన్ చేరాడు...
88 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ని కేన్ విలియంసన్, టామ్ లాథమ్ కలిసి ఆదుకున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. న్యూజిలాండ్ విజయానికి ఆఖరి 80 బంతుల్లో 109 పరుగులు కావాలి...
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 76 బంతుల్లో 80 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా కెప్టెన్ శిఖర్ ధావన్ 72 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్తో మెప్పించాడు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించి, భారత జట్టుకి భారీ స్కోరు అందించాడు.
65 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసిన శుబ్మన్ గిల్, లూకీ ఫర్గూసన్ బౌలింగ్లో డివాన్ కాన్వేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 77 బంతుల్లో 13 ఫోర్లతో 72 పరుగులు చేసిన శిఖర్ ధావన్, టిమ్ సౌథీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 23 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన రిషబ్ పంత్, లూకీ ఫర్గూసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వస్తూనే ఫోర్ బాదిన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత రెండో బంతికి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ కలిసి ఐదో వికెట్కి 94 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
38 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసిన సంజూ శాంసన్, ఆడమ్ మిల్నే బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. 76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ఆఖరి ఓవర్ వేసిన టిమ్ సౌథీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ మెరుపు బ్యాటింగ్ చేశాడు.