నువ్వు మాజీ కెప్టెన్వి.. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా..? అజారుద్దీన్ పై నెటిజన్ల ఆగ్రహం
T20I World Cup 2022: వచ్చే నెలలో జరుగబోయే టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ.. సోమవారం భారత జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టు ఎంపికపై మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ స్పందిస్తూ చేసిన సూచనలపై నెటిజన్లు అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ మాసాంతంలో మొదలుకాబోయే టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ.. భారత జట్టును సోమవారం ప్రకటించింది. అయితే జట్టు ఎంపికపై భారత మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ పెదవి విరిచాడు. జట్టు ఎంపికలో రెండు మార్పులు చేస్తే బాగుండేదని సూచించాడు. దీపక్ హుడా, హర్షల్ పటేల్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీని ఎంపిక చేస్తే బాగుండేదని ట్విటర్ వేదికగా స్పందించాడు.
జట్టు ఎంపికపై బీసీసీఐ చేసిన ట్వీట్ ను అజారుద్దీన్ ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ.. ‘శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీలు 15 మంది జట్టు సభ్యులలో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది’ అని ట్వీట్ చేశాడు. అంతేగాక ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో దీపక్ హుడాకు బదులు శ్రేయాస్ అయ్యర్.. హర్షల్ పటేల్ స్థానంలో మహ్మద్ షమీని ఎంపిక చేస్తే బాగుండేది..’ అని ట్వీటాడు.
అయితే అజారుద్దీన్ అభిప్రాయంతో నెటిజన్లు ఏకీభవించడం లేదు. శ్రేయాస్ అయ్యర్, షమీలను ఎంపిక చేయాలన్న అజారుద్ధీన్ అభిప్రాయంపై నెటిజన్లు స్పందిస్తూ..‘గతేడాది టీ20 ప్రపంచకప్ లో షమీ ఎకానమీ ఏంటో నీకు తెలుసా..? అవుట్డేట్ అయిన షమీని ఆడించమంటున్నావ్.. అదీ హర్షల్ పటేల్ స్థానంలో..? దీపక్ హుడా మంచి ఆల్ రౌండర్. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. అసలు టీ20 ఫార్మాట్ అంటే ఏంటో తెలుసుకో ముందు..’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఓ యూజర్ స్పందిస్తూ... ‘ఆస్ట్రేలియాలో ఉండేవి బౌన్సీ పిచ్ లు. నువ్వేమో శ్రేయాస్ అయ్యర్ ను ఎంపిక చేయమంటున్నావ్. అతడికేమో షార్ట్ పిచ్ బంతులు ఆడటం రాదు. అసలు అక్కడ అయ్యర్ ఆడగలడా..?’ అని పేర్కొన్నాడు. మరో యూజర్.. ‘హుడా స్థానంలో శ్రేయాస్ అయ్యరా..? ఓ పని చేయ్.. ముందు అతడికి షార్ట్ పిచ్ బంతులు ఎలా ఆడాలో నేర్పు, తర్వాత చూద్దాం..’ అని ఘాటుగా స్పందిస్తున్నారు. గగన్ చావ్లా అనే ఓ యూజర్ అయితే ఏకంగా.. ‘ఈ మనిషి ఇండియాకు కెప్టెన్ గా చేశాడు. కానీ ఏం లాభం..? ప్చ్..! నాకు ఎలా స్పందించాలో తెలియడం లేదు..’ అని అజారుద్దీన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.