టార్గెట్ 90.. గోల్డెన్ బాయ్ మీదే కళ్లన్నీ.. దోహా డైమండ్ లీగ్ లైవ్ చూడండిలా..
Neeraj Chopra: భారత ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా మళ్లీ జావెలిన్ త్రో లో రికార్డులు బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. నేడే దోహా వేదికగా జరుగబోయే కీలక టోర్నీలో పాల్గొననున్నాడు.
2021లో టోక్యో వేదికగా ముగిసిన ఒలింపిక్స్ లో భాగంగా జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన భారత ఆటగాడు నీరజ్ చోప్రా స్వల్ప విరామం తర్వాత నేడు మళ్లీ రణరంగంలోకి దూకనున్నాడు. తన ఈటె వేగం తగ్గలేదని నిరూపించేందుకు గాను నీరజ్ కు ఇది మంచి అవకాశం. నేటి నుంచే ఖతార్ రాజధాని దోహా వేదికగా జరుగబోయే డైమండ్ లీగ్ తొలి అంచె పోటీలలో నీరజ్ చోప్రా పాల్గొననున్నాడు.
గతేడాది సెప్టెంబర్ లో స్టాక్ హోమ్ వేదికగా ముగిసిన డైమండ్ లీగ్ -2022 పోటీలలో 88.44 మీటర్లు దూరం విసిరి స్వర్ణం సాధించిన నీరజ్.. ఈసారి స్వర్ణంతో పాటు జావెలిన్ ను 90 మీటర్లు విసరాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఈ మేరకు అతడు గట్టిగానే ప్రిపేర్ అయ్యాడు.
దోహా వేదికగా జరుగబోయే ఈ టోర్నీలో నీరజ్.. ప్రపంచ ఛాంపియన్ గా ఉన్న గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత జాకబ్ వాద్లిచ్ (చెక్ రిపబ్లిక్) , యూరోపియన్ ఛాంపియన్ జులియన్ వెబర్ (జర్మనీ), మాజీ ఒలింపిక్ విజేత జులియన్ వెబర్, వాల్కాట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో) తో పాటు కెన్యా సంచలనం యెగో తో తీవ్ర పోటీని ఎదుర్కుంటున్నాడు. స్టాక్ హోమ్లో నీరజ్ 90 మీటర్ల రికార్డు (89.94 మీటర్లు) ను తృటిలో కోల్పోయాడు. దోహాలో అయినా దానిని అందుకుంటాడా..? అన్నది ఆసక్తికరం.
కాగా ప్రస్తుతం దోహాలో జరుగుతున్నది లీగ్ దశ పోటీలు. పలు రౌండ్ల తర్వాత సెప్టెంబర్ లో తుది అంచె పోటీలు జరుగుతాయి. దోహాలో జరుగబోయే డైమండ్ లీగ్ పోటీలలో నీరజ్ తో పాటు మెన్స్ ట్రిపుల్ జంప్ లో ఎల్డోస్ పాల్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బర్మింగ్హామ్ లో గతేడాది ముగిసిన కామన్వెల్త్ పోటీలలో 17.03 మీటర్లు దూకి స్వర్ణం సాధించిన ఎల్డోస్ కు దోహాలో పోటీ తీవ్రంగా ఉండనుంది.
దోహాలో చోప్రా మ్యాచ్ కు సంబంధించిన షెడ్యూల్ ఇది..
- దోహాలోని ఖతార్ స్పోర్ట్స్ క్లబ్
- భారత్ కాలమానం ప్రకారం దోహా డైమండ్ లీగ్ రాత్రి 10.14 గంటల నుంచి మొదలవుతుంది.
- దోహా డైమండ్ లీగ్ ను స్పోర్ట్స్ 18 1, స్పోర్ట్స్ 18 1 హెచ్డీ లలో ప్రత్యక్షంగా చూడొచ్చు.
- స్పోర్ట్స్ 18తో పాటు జియో సినిమా యాప్ లో కూడా లైవ్ ను వీక్షించొచ్చు.