Sapna Gill: టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా తో పాటు తన స్నేహితుడిపై దాడి చేసిన కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్న గిల్ కు ముంబై కోర్టు షాక్చచింది.
భారత క్రికెట్ జట్టు ఆటగాడు, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడే పృథ్వీ షాపై దాడి చేసిన కేసులో భోజ్పురి నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అయిన సప్న గిల్ కు ముంబై లోని స్థానిక కోర్టు షాకిచ్చింది. ఈ కేసులో ఇదివరకే ఆమెను నాలుగు రోజుల పాటు కస్టడీకి పంపిన న్యాయస్థానం.. తాజాగా మరో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
నాలుగు రోజుల క్రితం ముంబైలోని విలే పార్లే ఈస్ట్లో ఉన్న ఓ లగ్జరీ హోటల్లో పృథ్వీ షాని సెల్ఫీ ఇవ్వాలని కోరగా అందుకు అతడు నిరాకరించాడు. దీంతో సప్న మిత్ర బృందం షా, అతడి ఫ్రెండ్ పై కర్రలతో దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ కేసులో షా స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సప్నను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో సప్నతో పాటు మరో 8 మందిపై ఆరోపణలు రావడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో సప్న, మరో ముగ్గురిని నేడు కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. కాగా ఈ కేసులో గిల్ తరఫున కోర్టులో వాదించిన న్యాయవాది అసలు తప్పంతా పృథ్వీదే అని వాపోయారు.
‘పృథ్వీ చేతిలో కర్రలున్నాయి. ముందు అతడే నా క్లయింట్ పై దాడికి దిగాడు. అతడి స్నేహితులు సప్న ఫ్రెండ్స్ పై దాడికి దిగిన వెంటనే వాళ్లు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు గిల్ కు వైద్య సదుపాయాల కోసం అనుమతించడం లేదు...’అని వాదించారు.
అంతకుముందు ఆయన మీడియా కథనాలను ఊటంకిస్తూ.. పృథ్వీ షాకు మద్యం తాగే అలవాటు ఉన్నదని తెలుస్తున్నదని, అందుకే బీసీసీఐ అతడిని బ్యాన్ చేసినట్టూ కథనాలు ఉన్నాయని అన్నారు. ‘రూ. 50 వేలు ఇస్తే ఈ కేసు ముగించేస్తాం అని సప్నా గిల్ అనలేదు. దీనికి అసలు ఆధారాలే లేవు. సప్నా కేవలం ఒక ఇన్ఫ్లూయెన్సర్. ఘటన జరిగిన తర్వాత కేసు నమోదు చేయడానికి 15 గంటల సమయం పట్టింది. తన ఫ్రెండ్తో పృథ్వీ షా ఈ కేసు పెట్టించారు. అదే రోజు ఎందుకు కేసు నమోదు చేయలేదు?’ అని వాదించారు.
ఎవరీ సప్న..?
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న సప్న స్వస్థలం చండీగఢ్. ఆమె మోడలింగ్ లో రాణిస్తూనే ఇన్స్టాలో రీల్స్, ఫోటో షూట్లతో ఫేమస్ అయింది. భారత్ లో ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న భోజ్పురి సినిమా ఇండస్ట్రీలో ఆమె నటిగా రాణిస్తోంది. భోజ్పురిలో పలు సినిమాలు కూడా చేసిన సప్నకు కాశీ అమర్నాథ్, నిర్హువ చలల్ లండన్ వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. 2021లో ఆమె నటించిన ‘మేరా వతన్’ సినిమా కూడా మంచి పేరు తెచ్చింది. గోరఖ్పూర్ ఎంపీ, అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమా విలన్ రవిశంకర్ నటించిన భోజ్పురి సినిమాలో సప్న హీరోయిన్ గా చేసింది. రవిశంకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాశీ అమర్నాథ్’సినిమాలో సప్న కీలక పాత్ర పోషించింది.
ఇక ఇన్స్టాలో 2.24 లక్షల మంది ఫాలోవర్లు కలిగిన గిల్.. వీడియోలు, పొట్టి డ్రెస్సులతో చేసే ఫోటో షూట్లతో పాపులారిటీని దక్కించుకుంది. దీంతోనే ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కేటగిరీలో చోటు దక్కించుకుంది.
