మీ కాళ్లు పొడవు.. నా సీట్లో కూర్చొండి: పెద్ద మనసు చాటుకున్న ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ధోనీ మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ధోనీ మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు.
యూఏఈలో జరుగనున్న ఐపీఎల్ కోసం ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ సైతం శుక్రవారం ప్రత్యేక విమానంలో దుబాయ్ బయల్దేరి వెళ్లారు.
జట్టుతో పాటు సీఎస్కే మేనేజర్ కె జార్జ్ జాన్ కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణంలో ధోనీతో జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశాన్ని జార్జ్ తన ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. ధోనికి కేటాయించిన బిజినెస్ క్లాస్ సీటులో తనను కూర్చోబెట్టి.. మహీ మాత్రం ఎకానమీ సీటులో వెళ్లి కూర్చొన్నాడు.
ఎందుకని అడిగితే... మీ కాళ్లు చాలా పెద్దగా ఉన్నాయి.. అందువల్ల మీకు ఎకానమీ క్లాస్ సీటు సరిపోదు. మీరు నా బిజినెస్ క్లాస్ సీటులో కూర్చొండి.. నేను వెళ్లి మీ సీటులో కూర్చుంటా అని ధోనీ తనతో చెప్పినట్లు జార్జ్ ట్వీట్లో పేర్కొన్నాడు.
తన సహచరులతో కలిసి కూర్చునేందుకే ధోనీ ఇదంతా చేశాడని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. కాగా యూఏఈ వచ్చే ముందు ఆటగాళ్లందరికీ కోవిడ్ టెస్టులు చేశారు.
అలాగే అక్కడ ఏడు రోజుల పాటు క్వారంటైన్లో ఉండననున్నారు. ఈ సమయంలో మళ్లీ మూడు సార్లు కరోనా టెస్టులు చేస్తారు. వీటిలో నెగిటివ్ వచ్చిన వారే బయో బబుల్లోకి వెళ్తారు. కాగా, సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది.