ప్రతీ బంతికీ అరుపులు, కేకలు, చప్పట్లు... మహ్మద్ సిరాజ్కి చెన్నై ప్రేక్షకుల సపోర్ట్...
సిరాజ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చప్పట్లతో ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులు...
రవిచంద్రన్ అశ్విన్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్న మహ్మద్ సిరాజ్...
ఆస్ట్రేలియాలో 13 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచిన మహ్మద్ సిరాజ్కి ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో ఊహించని అనుభవం ఎదురైంది. రవిచంద్రన్ అశ్విన్ 80 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆఖరి వికెట్గా క్రీజులోకి వచ్చాడు మహ్మద్ సిరాజ్.
అశ్విన్ బౌండరీలతో మోత మోగిస్తూ సెంచరీకి చేరువ కావడంతో మహ్మద్ సిరాజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టేడియంలోని ప్రేక్షకులు చప్పట్లు, ఈలలు, అరుపులతో అతనికి సపోర్ట్ చేశారు. అశ్విన్ బౌండరీలు కొట్టినప్పుడే ప్రేక్షకుల అరుపులు వినిపించగా, సిరాజ్ ఆపిన ప్రతీ బంతికి స్టేడియం మోత మోగిపోయింది.
మొదటి 15 బంతులాడి ఒకే ఒక్క సింగిల్ తీసిన మహ్మద్ సిరాజ్... రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఎగిరి గంతులేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. సహచర ప్లేయర్ ఫీట్ను తనదిగా సెలబ్రేట్ చేసుకున్న సిరాజ్, సోషల్ మీడియా జనాల మనసు దోచుకున్నాడు.
అశ్విన్ సెంచరీ తర్వాత రెండు భారీ సిక్సర్లు బాదిన సిరాజ్.. 21 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో అత్యధిక భాగస్వామ్యం 35 పరుగులు కాగా, భారత్ రెండో ఇన్నింగ్స్లో అశ్విన్, సిరాజ్ కలిసి ఆఖరి వికెట్కి 49 పరుగులు జోడించడం విశేషం.