MIvsDC: భారీ స్కోరు చేసిన ముంబై ఇండియన్స్... ఢిల్లీ ఫైనల్ చేరగలదా?
హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్...
40 పరుగులు చేసిన డి కాక్... మెరుపులు మెరిపించిన హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్...
మూడు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్...
IPL 2020 సీజన్ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా... మరో ఓపెనర్ క్వింటన్ డి కాక్ 25 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 40 పరుగులు చేశాడు.
మంచి ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. కిరన్ పోలార్డ్ కూడా డకౌట్ అయ్యాడు.వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన దశలో ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా కలిసి బౌండరీల మోత మోగించారు. కృనాల్ పాండ్యా 13 పరుగులు చేసి అవుట్ కాగా ఇషాన్ కిషన్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు.
హార్ధిక్ పాండ్యా 14 బంతుల్లో 5సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో భారీ స్కోరు చేయగలిగింది ముంబై ఇండియన్స్. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీయగా స్టోయినిస్, నోకియాలకి చెరో వికెట్ దక్కింది.