ఐపీఎల్ 2020 ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్... డిఫెండింగ్ ఛాంపియన్ ముందు ఢిల్లీ డీలా!
సున్నాకే మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...
ఒంటరి పోరాటం చేసిన మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్...
4 వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా... ట్రెంట్ బౌల్ట్కి రెండు వికెట్లు...
IPL 2020 సీజన్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది ముంబై ఇండియన్స్. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాతో సీజన్ను ఆరంభించిన ముంబై ఇండియన్స్... టోర్నీ ఆద్యంతం టాప్ క్లాస్ పర్ఫామెన్స్తో మరోసారి ఫైనల్ చేరింది. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ యంగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... మరోసారి ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడింది.
201 పరుగుల భారీ టార్గెట్తో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్... సున్నాకే మూడు వికెట్లు కోల్పోయింది. యంగ్ ఓపెనర్ పృథ్వీషా, వన్డౌన్లో వచ్చిన అజింకా రహానే, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్... ముగ్గురూ డకౌట్ అయ్యారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 12 పరుగులు చేసి అవుట్ కాగా... రిషబ్ పంత్ 3 పరుగులు చేశాడు.
41 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన దశలో మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్ కలిసి కాసేపు పోరాడారు. 46 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసిన స్టోయినిస్ అవుట్ కావడంతో మ్యాచ్పై ఉన్న చిట్టచివరి ఆశలు కూడా కోల్పోయింది ఢిల్లీ. అక్షర్ పటేల్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో బుమ్రాకి నాలుగు వికెట్లు దక్కగా ట్రెంట్ బౌల్ట్ రెండు, కృనాల్ పాండ్యా ఓ వికెట్ తీశారు.