చెలరేగిన మేఘాలయ క్రికెటర్: బ్యాటింగ్ ధాటికి టీ20 రికార్డు
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మేఘాలయ క్రికెటర్ అభియ్ నేగి రికార్డు సృష్టించాడు. దేశవాళీ క్రికెట్ లో అత్యంత వేగంగా అర్థ సెంచరీ సాధించిన రికార్డును సాధించాడు. కెఎల్ రాహుల్ రికార్డును సమం చేశాడు.
ముంబై: ముస్తాక్ అలీ టోర్నమెంటులో మేఘాలయా ఆల్ రౌండర్ అభయ్ నేగి బ్యాట్ తో చెలరేగిపోయాడు. దాంతో అతను రికార్డు సృష్టించాడు. ఆదివారం మిజోరంలో జరిగిన మ్యాచులో అభయ్ కేవలం 14 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు. దాంతో దేశవాళీ టోర్నిలో ఫాస్టెస్ట్ అర్థ సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
రాబిన్ ఊతప్ప పేరుమ మీద ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును అభయ్ నేగి బద్దలు కొట్టాడు. కెఎల్ రాహుల్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచులో అభయ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో అర్థ సెంచరీ చేశాడు. రవితేజ 53 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. దీంతో మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన మిజోరం 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఓటమి పాలైంది. మిజోరం ఆటగాడు తరువార్ కోహ్లీ 59 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 90 పరుగులు చేశాడు. కేబీ పవన్ 46 బంతుల్లో ఆరు ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 72 పరుగులు చేశాడు. అయినప్పటికీ మిజోరంకు ఓటమి తప్పలేదు.