Asianet News TeluguAsianet News Telugu

BCCI: బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కుల ప్రక్రియ పూర్తి.. ఇకనుంచి ఆ సంస్థకే..

BCCI Title Sponsor: భారత్ లో జరిగే జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు  టైటిల్ స్పాన్సర్‌షిప్ గా వ్యవహరిస్తున్న పేటీఎం.. వాటి నుంచి తప్పుకుంది. ఆ స్థానంలో మరో సంస్థ వచ్చి చేరింది. 
 

Mastercard Acquires BCCI Title Sponsorship Rights For All Demestic and Internatioanl Matches
Author
First Published Sep 6, 2022, 10:22 AM IST

ఇండియాలో వచ్చే ఏడాది వరకు జరుగనున్న జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులకు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు మాస్టర్ కార్డ్ దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను బీసీసీఐ పూర్తి చేసింది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.  2015 నుంచి  బీసీసీఐతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న పేటీఎం.. టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కుల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది  జులై లో ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో పేటీఎం ఈ ప్రతిపాదనను తెచ్చింది. 

2015 నుంచి ఇప్పటివరకు పేటీఎం.. బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌షిప్ గా వ్యవహరించింది.   వాస్తవానికి  వచ్చే ఏడాది వరకు  పేటీఎం.. బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ మరో ఏడాది ఉండగానే పేటీఎం.. ఈ హక్కులను మాస్టర్ కార్డ్ కు మళ్లించాలని గత జులైలో బీసీసీఐకి విన్నవించుకుంది. 

పేటీఎం అభ్యర్థను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ.. టైటిల్ స్పాన్సర్ హక్కులను  మాస్టర్ కార్డ్ కు మళ్లించింది. ఈ డీల్ కు సంబంధించిన ప్రక్రియ సజావుగా ముగిసిందని బీసీసీఐ తాజా ప్రకటనలో వెల్లడించింది. 

తాజా ఒప్పందంతో మాస్టర్ కార్డ్ ఇకనుంచి భారత అంతర్జాతీయ మ్యాచులతో పాటు దేశవాళీ మ్యాచులకూ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. సెప్టెంబర్ నుంచి ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. టీమిండియాకు మాస్టర్ కార్డ్  టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించబోయే తొలి సిరీస్ ఇదే కానున్నది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు.. దక్షిణాఫ్రికాతో కూడా 3 టీ20లు ఆడల్సి ఉంది.

ఇదిలాఉండగా.. 2015 లో పేటీఎం బీసీసీఐతో నాలుగేండ్లకు రూ. 203 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.  ఆ తర్వాత 2019లో ఆ ఒప్పందాన్ని పునరుద్దరించుకుంది. ఈ డీల్ ఒప్పందం రూ. 326.80 కోట్లు. ఒప్పందం ప్రకారం పేటీఎం 2023 వరకు కొనసాగాలి. కానీ పేటీఎం మాత్రం  మరో ఏడాది బాకీ ఉండగానే టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వైదొలగడం అనుమానాలకు తావిస్తున్నది. 

 

పేటీఎం కథ ఇది.. 

- 2015లో పేటీఎం తొలిసారి టైటిల్ స్పాన్సర్ గా  ఫీల్డ్ లోకి వచ్చింది. 
- 2019లో ఈ డీల్ ను నాలుగేండ్ల పాటు పునరుద్దరించుకుంది. 
- డీల్ ఒప్పందం  రూ. 326.80 కోట్లు.ఒప్పందం ప్రకారం 2023 వరకు కొనసాగాలి. 
- 2019 వరకు మ్యాచ్ కు రూ. 2.4 కోట్ల ఉన్న విలువను 2019 తర్వాత  రూ. 3.80 కోట్లకు పెంచి మరీ హక్కులు దక్కించుకున్న పేటీఎం అర్థాంతరంగా స్పాన్సర్షిప్ నుంచి వైదొలగాలని ప్రతిపాదించడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios