Road Safety World Series: భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మళ్లీ బ్యాట్ పట్టబోతున్నాడు. మరో తొమ్మిదిరోజుల్లో సచిన్ ఆటను వీక్షించే అవకాశం అభిమానులకు దక్కనుంది. 

భారత్ లో క్రికెట్‌ను ఒక మతంగా పరిగణిస్తే ఆ మతానికి సచిన్ టెండూల్కర్ ఆరాధ్య దైవం. అభిమానులంతా ‘క్రికెట్ గాడ్’గా పిలుచుకునే మాస్టర్ బ్లాస్టర్ ఆటను మళ్లీ ఆస్వాదించేందుకు రంగం సిద్ధమవుతున్నది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ (ఆర్ఎస్‌డబ్ల్యూఎస్) రెండో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త అందింది. ఈ సిరీస్ లో పాల్గొనబోయే ‘ఇండియా లెజెండ్స్’కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సారథ్యం వహించనున్నాడు.

సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 1 వరకు కాన్పూర్, రాయ్‌పూర్, ఇండోర్, డెహ్రాడూన్ లలో మ్యాచ్ లు జరుగనున్నాయి. కాన్పూర్ లో ప్రారంభ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. సెమీస్, ఫైనల్స్ రాయ్‌పూర్ లో జరుగుతాయి. టీ20 ఫార్మాట్ లో ఈ టోర్నీ జరుగుతుంది. 

ఇండియా లెజెండ్స్ తో పాటు ఆర్ఎస్‌డబ్ల్యూఎస్ లో న్యూజిలాండ్ లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్, ఇంగ్లాండ్ లెజెండ్స్ జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 8 దేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లతో కూడిన ఈ టోర్నీకి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతుగా ఉంది. 

22 రోజుల పాటు సాగే ఈ టోర్నీని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ మద్దతుగా నిలుస్తున్నది. భారత్‌‌లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అవగాహన కల్పించేందుకు గాను ఆర్ఎస్‌డబ్ల్యూఎస్ సిరీస్ ను నిర్వహిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీతో పాటు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, సమాచారం మంత్రిత్వ శాఖ కూడా ఆర్ఎస్‌డబ్ల్యూఎస్ కు మద్దతుగా ఉన్నాయి. యూఎస్ కు చెందిన 27 ఇన్వెస్ట్మెంట్ సంస్థ.. మార్కెటింగ్ హక్కులను కలిగిఉన్న ఈ టోర్నీకి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ గ్రూప్ (పీఎంజీ) ఈవెంట్ మేనేజ్మెంట్ పార్ట్నర్ గా ఉంది. 

ఆర్ఎస్‌డబ్ల్యూఎస్ సిరీస్ కు సంబంధించిన మ్యాచ్ ల హక్కులను ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని స్పోర్ట్స్ 18 వద్ద ఉన్నాయి. ఈ మ్యాచ్ లను జియోతో పాటు వూట్ యాప్ లలో వీక్షించొచ్చు. 

Scroll to load tweet…

కాగా గతేడాది ఆర్ఎస్‌డబ్ల్యూఎస్ సిరీస్ సీజన్-1 లో భాగంగా ఇండియా లెజెండ్స్ - శ్రీలంక లెజెండ్స్ మధ్య ఫైనల్ జరిగింది. ఫైనల్ లో ఇండియా లెజెండ్స్.. 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్.. 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. బదులుగా శ్రీలంక.. 20 ఓవర్లలో 167 పరుగులకే పరిమితమైంది. తొలి సీజన్ లో సచిన్.. 7 మ్యాచ్ లలో 228 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్.. 7 మ్యాచ్ లలో 214 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.