LPL: వచ్చే నెలలో లంక ప్రీమియర్ లీగ్.. అఫీషియల్ సాంగ్ విడుదల.. మళ్లీ మాయ చేసిన ‘మణికె మాగె హితె’ సింగర్
Lanka Premier League: ‘మణికె మాగె హితె..’ ఈ పాట గుర్తుందిగా.. కొన్ని రోజుల క్రితం యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టించింది. ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది యొహని.
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, మోజో, షేర్ చాట్.. ఇలా ఏ యాప్ ఓపెన్ చేసినా కొద్దిరోజుల క్రితం ఒక పాట మార్మోగుతుండేది. అదే ‘మణికె మాగె హితె...’.. ఈ ఒక్క పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసింది శ్రీలంక (Srilanka)కు చెందిన గాయని యొహని డి సిల్వా (Yohani De Silva). యూట్యూబ్ లో ఈ పాట ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. కోట్లాది మంది వీక్షించిన ఈ పాటను పాడిన యొహని.. ఇప్పుడు మరో పాటతో అలరిస్తున్నది. అదీ శ్రీలంక క్రికెట్ బోర్డు (Srilanka cricket Board) ఆధ్వర్యంలో నడుస్తున్న లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) కోసం కావడం విశేషం.
వచ్చే నెల మొదలుకానున్న Lanka Premier League కోసం యోహని ఈ పాట పాడింది. యొహని తో పాటు మరికొందరు లంక గాయకులు.. బతియా అండ్ సంతుష్, సజిత, ఉమరియ, ఏడీకే లు ఈ పాటను పాడారు. ‘ఏక్వా జయగము..’ (Ekwa Jayagamu) అనే ఈ పాట ఇప్పుడు ద్వీప దేశాన్ని ఓ ఊపు ఊపుతున్నది. ఇటీవలే ఈ పాటను విడుదల చేశారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ పాటను మీరు కూడా చూసేయండి.
ఇదిలాఉండగా.. LPL లో ఇది రెండో సీజన్. డిసెంబర్ 5 నుంచి 23 దాకా టోర్నీ జరుగనున్నది. కాగా.. 2020లో మొదలైన ఎల్పీఎల్ లో మొత్తం ఐదు ఫ్రాంచైజీలున్నాయి. అవి కొలంబో స్టార్స్, దంబుల్లా గేయింట్స్, గాలె గ్లాడియేటర్స్, జాఫ్నా కింగ్స్, కాండీ వారియర్స్ లు టైటిల్ పోరులో తలపడబోతున్నాయి.
2020లో జరిగిన ఎల్పీఎల్ లో జాఫ్నా స్టాలియన్స్ విజేతగా నిలిచింది. శ్రీలంక క్రికెటర్ తిషారా పెరీరా సారథ్యంలోని జాఫ్నా జట్టు.. గాలె గ్లాడియేటర్స్ ను చిత్తు చేసి తొలి ఎల్పీఎల్ టైటిల్ నెగ్గింది.
కాగా ఎల్పీల్ ప్రారంభం సందర్భంగా ఆ దేశ యువజన, క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స మాట్లాడుతూ.. దేశంలోని యువ క్రికెటర్లను వెలికితీసి వారిని ప్రోత్సహించడానికే ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. లంకకు క్రికెట్ లోనే గాక వాలీబాల్, నెట్ బాల్ లో కూడా అఫిషియల్ స్పాన్సర్ గా ఉన్న డైలాగ్ అక్షియట (Dialog Axiata) ఎల్పీఎల్ కు కూడా స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నది.