పుజారా బౌలింగ్.. మరి నేనేం చేయాలి..? టీమ్ నుంచి తప్పుకోవాలా..? అంటూ అశ్విన్ సెటైర్లు..
INDvsAUS: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, నయా వాల్ ఛటేశ్వర్ పుజారాల మధ్య ట్విటర్ లో ఆసక్తికర సంభాషణ జరిగింది. పుజారా బౌలింగ్ చేయడంపై అశ్విన్ స్పందిస్తూ..
భారత్ - ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా ముగిసిన నాలుగో టెస్టు డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ కు అనుకూలించిన ఈ పిచ్ పై బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటర్లు ఔట్ కాకపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. ఛటేశ్వర్ పుజారా, శుభ్మన్ గిల్ లకు బంతినిచ్చాడు. పుజారా, గిల్ లు తలా ఓ ఓవర్ వేశారు. అయితే పుజారా బౌలింగ్ చేయడంపై తాజాగా టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెటైర్లు విసిరాడు.
నాలుగో టెస్టు ముగిసిన తర్వాత పుజారా బౌలింగ్ చేస్తున్న ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేస్తూ అశ్విన్.. ‘నువ్వు కూడా బౌలింగ్ చేస్తే నేనేం చేయాలి..? ఇక నా జాబ్ వదిలేయాలా..?’అంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు. దీనికి పుజారా కూడా రిప్లై ఇచ్చాడు.
అశ్విన్ ట్వీట్ కు పుజారా స్పందిస్తూ... ‘లేదు. నాగ్పూర్ టెస్టులో నా బదులు నువ్వు వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చావు క దా. అందుకే కృతజ్ఞతగా ఇలా చేశాను...’అని రిప్లై ఇచ్చాడు. నాగ్పూర్ టెస్టులో అశ్విన్.. తొలి రోజు కెఎల్ రాహుల్ నిష్క్రమించిన తర్వాత నైట్ వాచ్మెన్ గా వచ్చిన విషయం తెలిసిందే. కాగా పుజారా ట్వీట్ కు అశ్విన్ స్పందించాడు.. ‘పుజారా నీ ఉద్దేశం ప్రశంసించేలా ఉంది. కానీ ఇలా తిరిగిచ్చేస్తావని నేనైతే అస్సలు ఊహించలేదు...’అని పేర్కొన్నాడు.
ఇక అశ్విన్ ట్వీట్ కు పుజారా కూడా మళ్లీ రిప్లై ఇచ్చాడు. ‘నీకు విశ్రాంతినిస్తా. ఫ్యూచర్ లో ఎప్పుడైనా నువ్వు వన్ డౌన్ లో వచ్చి ఆడేందుకు సాయపడతా..’అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరి ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య ముగిసిన అహ్మదాబాద్ టెస్టు విషయానికొస్తే సిరీస్ లో తొలిసారిగా బ్యాటర్లకు పూర్తిస్థాయిలో సహకరించిన ఈ పిచ్ పై పరుగుల వరద పారింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగుల భారీ స్కోరు చేసింది. ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ లు సెంచరీలు చేశారు. ఇక భారత్ తరఫున ఫస్ట్ ఇన్నింగ్స్ లో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీలు సెంచరీలు బాదారు. ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా.. రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆ తర్వాత డిక్లేర్ చేసినా ఫలితం తేలదని ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి.
ఈ విజయంతో భారత్.. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో గెలుచుకుంది. భారత్ కు ఇది వరుసగా నాలుగో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కావడం గమనార్హం. అహ్మదాబాద్ టెస్టులో విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా అశ్విన్, రవీంద్ర జడేజాలకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. సిరీస్ లో అశ్విన్ 25 వికెట్లు పడగొట్టగా జడేజా 22 వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ముగియడంతో ఈనెల 17 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.