First Female Umpire: న్యూజిలాండ్ - శ్రీలంకల మధ్య జరిగిన రెంటో టీ20 మ్యాచ్ పురుషుల క్రికెట్ లో కొత్త చరిత్రకు నాంది పలికింది. తొలిసారి ఓ మెన్స్ క్రికెట్ టీమ్కు మహిళా అంపైర్ బాధ్యతలు నిర్వర్తించింది.
పురుషాధిక్యత ఎక్కువగా ఉండే క్రికెట్ లో మహిళా క్రికెట్ కు ఇప్పుడిప్పుడే క్రేజ్ పెరుగుతున్నది. గత కొంతకాలంగా క్రికెట్ బోర్డుల సంస్కరణల పుణ్యమా అని ఈ ఆటలో మహిళలకూ కీలక ప్రాధాన్యం దక్కుతున్నది. సమాన వేతనాలు, పురుషుల క్రికెట్ తో సమానంగా ఫ్రాంచైజీ క్రికెట్ లో ఎంట్రీ.. ఉన్నత స్థానాల్లో కీలక పదవులు.. ఇలా వడివడిగా అడుగులేస్తున్న నేపథ్యంలో మరో కీలక సందర్భం. న్యూజిలాండ్ - శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఈ అరుదైన సందర్బానికి వేదికైంది. ఒక పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు మహిళ అంపైరింగ్ చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.
కివీస్ - లంక మధ్య డునెడిన్ వేదికగా జరిగిన రెండో టీ20లో కివీస్ అంపైర్ కిమ్ కాటన్.. ఈ మ్యాచ్కు ఆన్ ఫీల్డ్ అంపైర్ గా వ్యవహరించింది. పురుషుల క్రికెట్ లో ఒక మహిళ ఆన్ ఫీల్డ్ అంపైర్ గా విధులు నిర్వర్తించడం చరిత్రలో ఇదే తొలిసారి.
కాటన్ గతంలో భారత్ - న్యూజిలాండ్ మధ్య నవంబర్ లో జరిగిన మయాచ్ కు కూడా అంపైరింగ్ చేసింది. కానీ అప్పుడు ఆమె ఆన్ ఫీల్డ్ అంపైర్ గా కాకుండా థర్డ్ అంపైర్ గా విధులు నిర్వర్తించింది. పురుషుల క్రికెట్ లో అంపైరింగ్ చేయడం ఇదే తొలిసారి అయినా ఆమె గతంలో మహిళల క్రికెట్ లో 24 వన్డేలు, 54 టీ20 మ్యాచ్ లలో కూడా అంపైర్ గా చేసింది. ద 2018 నుంచి అంపైర్ గా సేవలందిస్తున్న ఆమె.. 2020, 2022త పాటు ఇటీవలే ముగిసిన 2023 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో కూడా అంపైర్ గా విధులను నిర్వర్తించింది.
రెండో టీ20లో కివీస్ జయభేరి..
ఇక కివీస్ - లంక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 19 ఓవర్లలో 141 పరుగులకే పరిమితమైంది. ధనంజయ డిసిల్వ (37) టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఆడమ్ మిల్నే ఏకంగా ఐదు వికెట్లు తీయగా బెన్ లిస్టర్ కు రెండు వికెట్లు దక్కాయి. స్వల్ప లక్ష్యాన్ని కివీస్ ‘ఉఫ్’మని ఊదిపడేసింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్.. (43 బంతుల్లో 79 నాటౌట్, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), చాడ్ బోవ్స్ (15 బంతుల్లొ 31, 7 ఫోర్లు) ధాటిగా ఆడి 14.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో లంక (సూపర్ ఓవర్ ద్వారా) నెగ్గగా రెండో మ్యాచ్ లో కివీస్ గెలిచింది. సిరీస్ లో నిర్ణయాత్మక మూడో మూడో మ్యాచ్ ఏప్రిల్ 8న జరుగుతుంది.
