భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆండ్రూ రస్సెల్... జమైకా దేశానికి..
జమైకాలో కరోనా నియంత్రణ కోసం 50 వేల వ్యాక్సిన్లను పంపిన కేంద్రం...
వీడియో సందేశం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఆండ్రూ రస్సెల్...
పొరుగు దేశాలకు సాయం చేస్తూ, విదేశీ క్రికెటర్ల మనసు గెలుచుకుంటోంది ఇండియా. కొన్నాళ్ల క్రితం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపగా, ఇప్పుడు వెస్టిండీస్ ఆల్రౌండర్, కేకేఆర్ హిట్టర్ ఆండ్రూ రస్సెల్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపాడు...
జమైకా దేశానికి కరోనా వ్యాక్సిన్ను అందించింది భారత ప్రభుత్వం. జమైకాలో కరోనా నియంత్రణ కోసం 50 వేల వ్యాక్సిన్లను అక్కడికి పంపించింది కేంద్రం. జమైకా చేరుకున్న వ్యాక్సిన్లను అందుకున్న అక్కడి రాయభార కార్యాలయం, విండీస్ క్రికెటర్ ఆండ్రూ రస్సెల్ వీడియో సందేశాన్ని పోస్టు చేసింది.
‘భారత ప్రధాని నరేంద్ర మోదీకి, హై కమిషన్కు ధన్యవాదాలు. వ్యాక్సిన్లు ఇక్కడికి వచ్చేశాయి. భారత్, జమైకా ఎప్పటికీ మంచి స్నేహితులే. మీరంతా అక్కడ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా...
ఆపద సమయంలో ఆదుకున్న భారత ప్రభుత్వానికి, ఇండియా ప్రజలకు మా ప్రేమను కృతజ్ఞతల రూపంలో తెలియచేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు ఆండ్రూ రస్సెల్.