INDvsAUS: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపట్నుంచి నాలుగో టెస్టు జరుగబోతున్నది. ఈ టెస్టు ప్రారంభానికి ముందే విలేకరుల సమావేశంలో పాల్గొన్న రోహిత్ మాజీ హెడ్ కోచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియాతో వరుసగా రెండు టెస్టులను గెలుచుకున్న తర్వాత భారత జట్టు ఇండోర్ లో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఊహించిన దానికంటే అతిగా తిరిగిన ఇండోర్ పిచ్ లో భారత బ్యాటర్లు క్రీజులో నిలవడానికే నానా తంటాలు పడ్డారు. ఇండోర్ లో భారత ప్రదర్శన చూశాక టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. రోహిత్ సేనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై రోహిత్ కౌంటర్ ఇచ్చాడు.
ఇండోర్ టెస్టు జరుగుతున్న సమయంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న రవిశాస్త్రి భారత వైఫల్యాన్ని చూస్తూ... ‘రెండు టెస్టులలో గెలిచిన తర్వాత కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఆట ఆడేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి.. లేకుంటే అది మిమ్మల్ని పాతాళానికి పడేస్తుంది...’అని వ్యాఖ్యానించాడు.
తాజాగా రోహిత్ స్పందిస్తూ... ‘వాస్తవంగా చెప్పాలంటే మేం రెండు టెస్టు మ్యాచ్ లను గెలిచిన తర్వాత బయటఉండేవాళ్లు మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని అన్నారు. ఇది నిజంగా చెత్త వాగుడు. ఎందుకంటే మేం నాలుగు మ్యాచ్ లలో మా బెస్ట్ ఇవ్వడానికే కష్టపడుతున్నాం...
రెండు మ్యాచ్ లు గెలిచిన తర్వాత మేం ఆగిపోవాలని ఎవరూ కోరుకోరు. మేం కూడా అంతే. మాకు అతినమ్మకం పెరిగిపోయిందని, ఇతర కామెంట్లు చేసేవాళ్లందరూ బయటివాళ్లే. వాళ్లకు డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతుందో తెలియదు...’అని ఘాటుగా స్పందించాడు. రవిశాస్త్రి పేరును ప్రత్యేకించి ప్రస్తావించకపోయినా రోహిత్ అన్న మాటలు శాస్త్రిని ఉద్దేశించి అన్నవేనని టీమిండియా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
రవిశాస్త్రి 2014 నుంచి 2021 వరకూ టీమిండియాకు హెడ్ కోచ్ గా పనిచేశాడు. అతడికి కూడా డ్రెస్సింగ్ రూమ్ సంగతులు ఏ టు జెడ్ తెలుసు. తెలిసి కూడా ఇలాంటి కామెంట్స్ చేసినందుకే రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటాడని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వాదిస్తున్నారు. తమకు ఇలాంటి విమర్శలు కొత్త కాదని.. స్వదేశంతో పాటు విదేశాల్లో ఆడేందుకు వెళ్లినా ఇవే కామెంట్స్ చేస్తారని.. తాము మాత్రం వేటిని పట్టించుకోమని రోహిత్ స్పష్టం చేశాడు.
కాగా రేపట్నుంచి అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే నాలుగో టెస్టులో భారత తుది జట్టులో మార్పులు ఉండొచ్చని తెలుస్తున్నది. ఈ సిరీస్ లోనే ఎంట్రీ ఇచ్చి గత మూడు టెస్టులలో దారుణంగా విఫలమైన ఆంధ్రా కుర్రాడు కోన శ్రీకర్ భరత్ కు అహ్మదాబాద్ టెస్టులో చోటు దక్కడం గగనమేనని జట్టు వర్గాల ద్వారా తెలుస్తున్నది. అతడి స్థానంలో పరిమిత ఓవర్లలో ఆడిస్తున్న ఇషాన్ కిషన్ ను ఆడించనున్నారని సమాచారం. షభ్ పంత్ గాయపడటంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న భరత్.. తొలి మూడు టెస్టులలో కీపింగ్ లో ఫర్వాలేదనిపించినా బ్యాటింగ్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ మూడు టెస్టులలో ఐదు ఇన్నింగ్స్ లలో కలిపి భరత్.. 57 పరుగులే చేశాడు. భరత్ తో పాటు సిరాజ్ ను కూడా తొలగించి మహ్మద్ షమీకి జట్టులో చోటిస్తారని సమాచారం.
