ధోనీ రిటైర్మమెంట్ పుకార్లు: భార్య సాక్షి రియాక్షన్ ఇదీ...
టీమిండియా మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతారంటూ ప్రచారం సాగింది. అయితే, ఆ పుకార్లపై ధోనీ సతీమణి సాక్షి స్పందించారు. మూడు పదాలతో అసలు విషయం తెల్చేశారు.

ముంబై: ఆంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎంఎస్ ధోనీ తప్పుకుంటారనే పుకార్లపై స్పష్టత వచ్చింది. గురువారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తన రిటైర్మెంట్ గురించి ప్రకటిస్తారని ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఈ పుకార్లపై ధోనీ సతీమణి సాక్షి స్పందించారు. పుకార్లకు ఆమె తెర దించారు.
అవన్నీ పుకార్లంటూ సాక్షి మూడు పదాలతో ధోనీ రిటైర్మెంట్ ప్రచారానికి తెర దించారు. అంతకు బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ధోనీ రిటైర్మెంట్ పుకార్లపై స్పందించారు. అందులో నిజం లేదని ఆయన చెప్పారు. తమకు అలాంటి సమాచారమేదీ లేదని అన్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టు వివరాలు ప్రకటించిన సందర్భంలో ఆయన ధోనీ రిటైర్మెంట్ పుకార్లపై స్పందించారు. ధోనీ చివరిసారిగా భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ మ్యాచ్ 2019లో ఆడాడు. ఆస్ట్రేలియాపై బెంగళూరులో జరిగిన టీ20 అది.
విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటారంటూ పుకార్లు పుట్టాయి. అవి గాలికన్నా వేగంగా వ్యాపించాయి.