రంజీలో కొడుకు తొలి సెంచరీ.. సచిన్ స్పందన ఇదే..
Arjun Tendulkar Century: తన కెరీర్ లో ఆడిన తొలి రంజీ మ్యాచ్లోనే తండ్రి మాదిరిగానే సెంచరీ బాదాడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్. రాజస్తాన్ తో మ్యాచ్ లో అర్జున్ సెంచరీ చేసిన తర్వాత ఈ జూనియర్ టెండూల్కర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
రంజీ ట్రోఫీలో భాగంగా గోవా తరఫున ఆడుతున్న సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ తండ్రి మాదిరిగానే తాను ఆడుతున్న తొలి రంజీ మ్యాచ్ లోనే సెంచరీ బాదాడు. అయితే అర్జున్ సెంచరీపై సచిన్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అర్జున్ సోదరి సారా టెండూల్కర్ కూడా ఫుల్ హ్యాపీలో ఉన్నట్టు పేర్కొంది. మరి సచిన్ రియాక్షన్ ఏంటి..? కొడుకు సెంచరీపై సచిన్ ఏమన్నాడు..?
ఇన్ఫోసిస్ స్థాపించి 40 ఏండ్లు గడిచిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సచిన్ తన కొడుకు సెంచరీ చేయడంపై స్పందించాడు. ఒక తండ్రిగా ఇది చాలా కఠినమైన ప్రశ్న (అర్జున్ గురించి అడిగినప్పుడు) అని, తనకు తన తండ్రి గుర్తొచ్చాడని చెప్పుకొచ్చాడు.
సచిన్ మాట్లాడుతూ.. ‘నన్ను ఎవరూ అడగని కఠినమైన ప్రశ్న ఇది. నేను ఇండియా తరఫున ఆడినప్పుడు ఆయనను ఎవరో పరిచయం చేస్తూ.. ‘ఈయన సచిన్ తండ్రి’ అని చెప్పారు. అప్పుడు మా నాన్న స్నేహితుడు నిన్ను అలా అన్నందుకు నువ్వు ఎలా భావిస్తున్నావని అడిగాడు. దానికి మా నాన్న ఇది నా జీవితంలో గర్వించదగ్గ క్షణం అని చెప్పాడు. అది నాకింకా గుర్తుంది. ఇక అర్జున్ గురించి చెప్పాలంటే వాడు అందరు పిల్లల్లాగా బాల్యాన్ని గడపలేదు. ఒక స్టార్ క్రికెటర్ కొడుకు అనే ఒత్తిడి వాడి మీద ఉంది. నేను రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు కూడా ముంబైలో మీడియాతో కూడా ఇదే చెప్పాను. ముందు మీరు అర్జున్ ను క్రికెట్ పై ప్రేమలో పడనివ్వండి. అతడికి ఆ అవకాశమివ్వండి.
వాడు బాగా ఆడితే మీకు నచ్చిన స్టేట్మెంట్లు ఇవ్వొచ్చు. అర్జున్ పై ఒత్తిడి తీసుకురావొద్దు. ఎందుకంటే నా తల్లిదండ్రుల నుంచి నాకు ఏ విధమైన ఒత్తిడి రాలేదు. వాళ్లు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నన్ను అన్ని విధాలా ప్రోత్సహించారు. అప్పుడే మనను మనం బయటకు వెళ్లి ఎలా మెరుగుపరుచుకోవాలనేదానిపై ఓ స్పష్టత వస్తుంది. నేను కూడా అర్జున్ విషయంలో అదే చేయాలనుకుంటున్నా. అయితే అది కూడా అంత ఈజీ కాదు. చాలా కఠినమైన సవాళ్లతో కూడిన ప్రయాణమది..’ అని తెలిపాడు.
సచిన్ లాగే అర్జున్ కూడా ముంబై తరఫున క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అండర్ - 19 జట్టుతో పాటు జూనియర్ స్థాయిలో ఆడాడు. 2021లో సీనియర్ టీమ్ లోకి వచ్చాడు. అయితే ముంబై రంజీ జట్టులో చోటు దక్కడం గగనమైన నేపథ్యంలో గోవాకు మారాడు. ఆ తర్వాత యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ మార్గనిర్దేశకత్వంలో ట్రైనింగ్ అయ్యాడు.