వన్డే క్రికెట్ చచ్చిపోతుందా..? తిరువనంతపురంలో సగం కంటే ఎక్కువ సీట్లు ఖాళీ..
INDvsSL: భారత్ -శ్రీలంక మధ్య తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా ముగిసిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. అయితే నిన్నటి మ్యాచ్ లో స్టేడియం పూర్తి స్థాయిలో నిండలేదు.
కొత్త ఏడాది ఇండియా తాను ఆడిన తొలి పరిమిత ఓవర్ల సిరీస్ ను ఘనంగా అందుకుంది. తొలుత హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని యువ భారత్... టీ20లలో 2-1 తేడాతో లంకను ఓడిస్తే తర్వాత రోహిత్ సేన.. 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా ముగిసిన మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ తో పాటు వెటరన్ విరాట్ కోహ్లీ సెంచరీతో మెరిశారు. మ్యాచ్ నిర్వహణలో లోపాలేమీ లేకపోయినా ఈ వన్డేను చూడటానికి ప్రేక్షకులు గ్రౌండ్ కు రాలేదు.
గ్రీన్ ఫీల్డ్ స్టేడియం సగానికంటే ఎక్కువగా ఖాళీగానే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘వన్డే క్రికెట్ చచ్చిపోతుందా..?’అని ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు.
యువీ తన ట్విటర్ వేదికగా.. ‘శుభమన్ గిల్ చాలా బాగా ఆడావ్. కోహ్లీ కూడా సాలిడ్ గా ఆడుతున్నాడు. కానీ నా ఆందోళన ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ స్టేడియం సగం ఖాళీగానే కనబడుతోంది. వన్డే క్రికెట్ చచ్చిపోతుందా..?’అని ట్వీట్ చేశాడు.
దీనికి పలువురు నెటిజన్లు ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. ‘పాజీ, నిన్న సౌత్ ఇండియాలో పండుగ ఉంది. అదీగాక ఇప్పటికే భారత్ సిరీస్ కూడా గెలిచింది. ఇది నామమాత్రపు వన్డే అని అనుకున్నట్టున్నారు. అందుకే స్టేడియం ఖాళీగా ఉంది..’అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. కేరళకు చెందిన ఫ్యాన్స్ మాత్రం.. ‘మా సంజూ శాంసన్ ను గాయం సాకు చూపి ఈ సిరీస్ నుంచి తప్పించారు. న్యూజిలాండ్ తో సిరీస్ లో కూడా ఎంపిక చేయలేదు. అందుకే మేం మ్యాచ్ ను బాయ్ కాట్ చేశాం..’అని కూడా వాపోతున్నారు.
ఓ యూజర్ అయితే ‘ప్రజలు ఈ జట్టు మీద నమ్మకం కోల్పోయినట్టు ఉన్నారు. రెండు టీ20 ప్రపంచకప్ ఓటములు, బంగ్లాదేశ్ తో ఓటమి, అంతకుముందు ఆసియా కప్ లో దారుణ వైఫల్యం.. అదీగాక స్పాన్సర్లు (బైజూస్) కూడా తప్పుకుంటున్నారు కాబట్టి ఇంక ఈ మ్యాచ్ లు చూడటం దండుగ అనుకున్నారేమో..’ అని కామెంట్ చేశాడు.