టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్... 8 గంటల 5 నిమిషాలకు ప్రారంభం కానున్న మ్యాచ్... 

ఐపీఎల్ 2022 సీజన్ ఎలమినేటర్ మ్యాచ్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలబడుతోంది. వర్షం కారణంగా 35 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యం కావడంతో 8 గంటల 5 నిమిషాలకు ఆట మొదలుకానుంది. ఇరుజట్లు కూడా పూర్తి ఓవర్ల పాటు ఆటను కొనసాగించవచ్చు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, రాజస్థాన్ రాయల్స్‌తో కలిసి మే 27న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో తలబడుతుంది. ఓడిన జట్టు ఐపీఎల్ 2022 సీజన్‌ని నాలుగో స్థానంతో ముగించాల్సి ఉంటుంది. గత రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్ చేరిన ఆర్‌సీబీ, రెండుసార్లు కూడా నాలుగో స్థానంలోనే ముగించింది.. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హజల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, కెఎల్ రాహుల్, ఇవిన్ లూయిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, మోహ్సీన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, దుస్మంత ఛమీరా, రవి భిష్ణోయ్ 

లక్నో సూపర్ జెయింట్స్ ఓపెన్ క్వింటన్ డి కాక్ గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై 70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెఎల్ రాహుల్‌తో కలిసి 210 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నిర్మించాడు...

నేటి మ్యాచ్‌లో క్వింటన్ డి కాక్, కెఎల్ రాహుల్‌తో పాటు దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్‌లను ఎంత త్వరగా అవుట్ చేస్తారనేదానిపైనే ఆర్‌సీబీ విజయం ఆధారపడి ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్‌లో మోహ్సీన్ ఖాన్, ఆవేశ్ ఖాన్ ఇద్దరూ అద్బుతంగా రాణిస్తున్నారు...

ఈ సీజన్‌లో పెద్దగా పర్పామెన్స్ ఇవ్వలేకపోయిన విరాట్ కోహ్లీ గత మ్యాచ్‌లో 70+ స్కోరుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలవడం ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి ఊరటనిచ్చే విషయం. దినేశ్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లిసిస్‌తో పాటు షాబాజ్ అహ్మద్ కూడా ఈ సీజన్‌లో మంచి పర్పామెన్స్ ఇచ్చాడు.. వానిందు హసరంగ పర్పుల్ క్యాప్ రేసులో ఉంటే హర్షల్ పటేల్ కూడా అద్భుతంగా రాణిస్తూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు... 

ఇరు జట్ల మధ్య గ్రూప్ స్టేజీలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయినా ఫాఫ్ డుప్లిసిస్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు చేయగా మ్యాక్స్‌వెల్ 23, షాబాజ్ అహ్మద్ 26, దినేశ్ కార్తీక్ 13 పరుగులు చేసి రాణించారు...

లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగుల మాత్రమే చేయగలిగింది. కెఎల్ రాహుల్ 30 పరుగులు చేయగా కృనాల్ పాండ్యా 42, మార్కస్ స్టోయినిస్ 24 పరుగులు చేసి అవుట్ అయ్యారు. జోష్ హజల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు...