IPL2021 RCB vs KKR: కేకేఆర్ ముందుకి, ఆర్సీబీ ఇంటికి... ఐపీఎల్ టైటిల్ లేకుండానే విరాట్ కోహ్లీ...
ఆఖరి ఓవర్లో నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న కోల్కత్తా నైట్రైడర్స్... బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడనున్న కేకేఆర్...
IPL 2021: ఆర్సీబీ కెప్టెన్గా ఆఖరి సీజన్లో టైటిల్ గెలవాలన్న విరాట్ కోహ్లీ ఆశలు నెరవేరలేదు. ఆఖరి ఓవర్ దాకా సాగిన మ్యాచ్లో ఫీల్డింగ్లో తప్పిదాలు, విలువైన క్యాచులను డ్రాప్ చేసి భారీ మూల్యం చెల్లించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరో ఎండ్లో కేకేఆర్ అద్భుత విజయాలతో ప్లేఆఫ్స్కి చేరి, రెండో క్వాలిఫైయర్ కోసం ఢిల్లీతో తలబడనుంది.
139 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ మొదలెట్టిన కోల్కత్తా నైట్రైడర్స్కి ఓపెనర్లు శుభారంభం అందించారు. 18 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ను హర్షల్ పటేల్ అవుట్ చేశారు. ఆ తర్వాత 5 బంతుల్లో ఓ ఫోర్తో 6 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, చాహాల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
అంపైర్ నాటౌట్గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన ఆర్సీబీకి అనుకూలంగా ఫలితం వచ్చింది. ఆ తర్వాత 30 బంతుల్లో ఓ సిక్సర్తో 26 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్ కూడా హర్షల్ పటేల్ బౌలింగ్లో శ్రీకర్ భరత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత వస్తూనే మూడు సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు సునీల్ నరైన్. డాన్ క్రిస్టియన్ వేసిన ఓవర్లో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు సునీల్ నరైన్.. ఐపీఎల్లో మొదటి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదిన మొదటి క్రికెటర్గా నిలిచాడు నరైన్...
25 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 23 పరుగులు చేసిన నితీశ్ రాణా, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్లో ఏబీ డివిల్లియర్స్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...ఈ సీజన్లో 32 వికెట్లు తీసి, ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా డీజే బ్రావో రికార్డును సమం చేశాడు హర్షల్ పటేల్. 17వ ఓవర్ మొదటి బంతికి సునీల్ నరైన్ ఇచ్చిన క్యాచ్ను పడిక్కల్ జారవిడచడంతో బ్రావో రికార్డును బ్రేక్ చేసే అవకాశం మిస్ చేసుకున్నాడు...
15 బంతుల్లో 3 సిక్సర్లతో 26 పరుగులు చేసిన సునీల్ నరైన్ని మహ్మద్ సిరాజ్ క్లీన్బౌల్డ్ చేశాడు. అయితే అప్పటికే కేకేఆర్ విజయానికి 16 బంతుల్లో 14 పరుగులు మాత్రమే కావాల్సిన స్థితికి చేరుకుంది...
ఆ తర్వాత రెండో బంతికి 12 బంతుల్లో ఓ ఫోర్తో 10 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్ కూడా కీపర్ శ్రీకర్ భరత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
సునీల్ నరైన్ వికెట్ మహ్మద్ సిరాజ్కి టీ20ల్లో 100వ వికెట్ కాగా, దినేశ్ కార్తీక్ వికెట్ ఐపీఎల్లో 50వ వికెట్ కావడం విశేషం..ఆఖరి ఓవర్లో 7 పరుగులు కావాల్సిన దశలో మొదటి బంతికే బౌండరీ బాదిన షకీబుల్ హసన్, మ్యాచ్ను ముగించేశాడు...