చెన్నైకి భారీ షాక్: ఐపీఎల్ నుంచి రైనా అవుట్!
వ్యక్తిగత కారణాల వల్ల సురేష్ రైనా భారత్ కి తిరిగి వచ్చేసాడని, మిగిలిన ఐపీఎల్ సీజన్ కి రైనా అందుబాటులో ఉండడని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పేర్కొంది.
ఇటీవలే మహేంద్ర సింగ్ ధోని తో కలిసి అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన సురేష్ రైనా.... ఐపీఎల్ కి కూడా దూరమయ్యాడు. ఈ సీజన్ ఆడేందుకు జట్టుతో కలిసి యూఏఈ కి వెళ్లినప్పటికీ... అనివార్య కారణాల వల్ల సురేష్ రైనా భారత్ కి తిరిగి వచ్చేసాడు.
ఈ విషయాన్నీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ట్విట్టర్ వేదికగా తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల సురేష్ రైనా భారత్ కి తిరిగి వచ్చేసాడని, మిగిలిన ఐపీఎల్ సీజన్ కి రైనా అందుబాటులో ఉండడని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో సురేష్ రైనాకు, అతని కుటుంబానికి పూర్తి స్థాయిలో చెన్నై జట్టు అండగా ఉంటుందని వారు తెలిపారు.
ఇకపోతే... మహేంద్ర సింగ్ ధోని స్వతంత్ర దినోత్సవం నాడు తన కెరీర్ కు రిటైర్మెంట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే ధోని రిటైర్మెంట్ ప్రకటించిన షాక్ నుంచి అభిమానులు తేరుకునేలోపే.... రైనా కూడా తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని విస్మయానికి గురి చేసింది.
తలా బాటలోనే చిన్న తలా అంటూ ఎమోషనల్ గా పోస్టులు పెట్టారు కూడా. ఇక ఈ విషయమై రైనా మాట్లాడుతూ... చెన్నై చేరుకోగానే ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న విషయం తనకు తెలిసే తాను కూడా సంసిద్ధుడనయ్యనై రైనా చెప్పుకొచ్చాడు. చార్టెడ్ ప్లేన్ లో పియూష్ చావ్లా, దీపక్ చాహర్, కరణ్ శర్మలతో కలిసి రైనా రాంచీ చేరుకున్నాడు. అక్కడి నుండి ధోని, మోను సింగ్ ని పిక్ చేసుకొని చెన్నై చేరుకున్నట్టుగా చెప్పుకొచ్చాడు రైనా.
రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని వెక్కివెక్కి ఏడ్చినట్టు తెలిపాడు. ఆ రాత్రి కేదార్ జాదవ్, పీయూష్, రైతు అందరితో కలిసి క్రికెట్ లోని మధుర జ్ఞాపకాల గురించి రాత్రంతా చర్చించినట్టుగా తెలిపాడు రైనా.
స్వతంత్ర దినోత్సవం నాడే ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారో చెప్పుకొచ్చాడు రైనా. ధోని జెర్సీ నెంబర్ 7 అని, తనది 3 అని. రెండు కలిపి 73 అవుతాయి. దానితోపాటు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు.