ఐపిఎల్2020: మరోసారి తెరపైకి మన్కడింగ్... ఈసారీ అశ్విన్ వల్లే
మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం క్రీడాస్పూర్తికి విరుద్దమని ఓ వాదన వుంది.
దుబాయ్: మన్కడింగ్... గత ఐపిఎల్ సీజన్ వరకు అంతగా పరిచయం లేని ఈ పేరు స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వల్ల ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. బౌలింగ్ చేసే సమయంలో బంతి ఇంకా బౌలర్ చేతిలో వుండగానే నాన్ స్ట్రైక్ ఎండ్ లో వున్న బ్యాట్స్ మెన్ క్రీజును దాటి వెళితే అతన్ని రనౌట్ చేయడమే మన్కడింగ్ అంటే.
అయితే ఈ మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం క్రీడాస్పూర్తికి విరుద్దమని ఓ వాదన వుంది. అందువల్ల బంతి వేయడానికి ముందే బ్యాట్స్ మెన్ క్రీజు దాటితే చాలామంది బౌలర్లు హెచ్చరిస్తారే తప్ప ఈ మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడానికి ఇష్టపడరు. అలాకాదని గత ఐపిఎల్ లో రాజస్థాన్ బ్యాట్స్ మెన్ జాస్ బట్లర్ ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేసి తీవ్ర విమర్శలపాలయ్యాడు అశ్విన్.
భీకర బెంగళూరుపై యువ ఢిల్లీ బ్రహ్మాండమైన విజయం
తాజాగా అలాంటి అవకాశమే వచ్చిన అశ్విన్ మన్కడింగ్ చేయడానికి వెనకాడారు. సోమవారం ఆర్సిబితో జరిగిన మ్యాచ్లో ఫించ్ను మన్కడింగ్ చేసే అవకాశం వచ్చినా అశ్విన్ ఉపయోగించుకోలేదు. తాను బంతి వేయడానికి ముందే ఫించ్ క్రీజుదాటడాన్ని గమనించిన అశ్విని బంతి వేయడాన్ని ఆపేసి ఫించ్ వైపు కోపంగా చూశాడే తప్ప అతన్ని ఔట్ చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో మరోసారి మన్కడింగ్ మీద చర్చ మొదలైంది.