టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... మొదటి నాలుగు మ్యాచుల్లో ఓడి బోణీ కోసం ఎదురుచూస్తున్న డేవిడ్ వార్నర్ టీమ్.. సౌరవ్ గంగూలీ వర్సెస్ విరాట్ కోహ్లీ ఫైట్గా..
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా నేడు బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్తో తలబడుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనుంది..
మొదటి నాలుగు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే నేటి మ్యాచ్లో గెలిచి తీరాల్సిందే. మరో వైపు మొదటి మ్యాచ్లో ముంబైని చిత్తు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓడింది...
కేకేఆర్తో మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఫ్లాప్ అయిన ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో బౌలింగ్లో తేలిపోయింది. 212 పరుగుల భారీ స్కోరు చేసిన తర్వాత కూడా బౌలింగ్ వైఫల్యం కారణంగా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు..
విరాట్ కోహ్లీ మూడు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలతో మంచి ఫామ్లో ఉన్నాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్తో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి, విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న విభేదాల గురించి అందరికీ తెలిసిందే...
ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కి క్రికెట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు సౌరవ్ గంగూలీ. దీంతో ఈ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్గా కాకుండా సౌరవ్ గంగూలీ వర్సెస్ విరాట్ కోహ్లీగా చూస్తున్నారు చాలామంది.
అయితే గత ఐదు మ్యాచుల్లో హోం గ్రౌండ్లో జరిగిన మ్యాచుల్లో టీమ్స్ ఓడిపోవడం, ఆర్సీబీని కలవరబెట్టే విషయం. వానిందు హసరంగ నేటి మ్యాచ్లో తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఆర్సీబీ బౌలింగ్ యూనిట్కి కాస్త పాజిటివ్ విషయం. నేటి మ్యాచ్ ద్వారా విజయ్ కుమార్ వైషక్, ఆర్సీబీ టీమ్ నుంచి ఐపీఎల్ ఆరంగ్రేటం చేస్తున్నాడు.
అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓ మార్పుతో నేటి మ్యాచ్లో బరిలో దిగుతోంది. పెళ్లి కోసం వారం రోజులు లీవ్ తీసుకుని స్వదేశానికి వెళ్లిన మిచెల్ మార్ష్ తిరిగి వచ్చి టీమ్తో కలిశాడు. దీంతో రోవ్మన్ పావెల్, రిజర్వు బెంచ్కే పరిమితం అయ్యాడు. మొదటి మూడు మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయిన మిచెల్ మార్ష్పై భారీ అంచనాలే పెట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...
మొదటి మూడు మ్యాచుల్లో ఏ మాత్రం ప్రభావం చూపని ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్తో జరిగిన గత మ్యాచ్లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి దాకా పోరాడింది. దీంతో నేటి మ్యాచ్లో గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, యష్ ధుల్, మనీశ్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హాకీం ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, ఆన్రీచ్ నోకియా, ముస్తాఫిజుర్ రహ్మాన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లిసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మ్యాక్స్వెల్, షాబజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్ వైషక్
