IPL 2023: ఐపీఎల్ - 16లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆదివారం (ఏప్రిల్ 16న) వాంఖెడే వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడబోయే మ్యాచ్ లో కొద్దిరోజుల క్రితం హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ధరించిన జెర్సీని వేసుకోనుంది.
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ జట్టు ఆదివారం వాంఖెడే వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరుగబోయే మ్యాచ్లో ప్రత్యేక జెర్సీతో కనిపించనుంది. ఈ మ్యాచ్ కు రోహిత్ సేన.. కొద్దిరోజుల క్రితమే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ మహిళల జెర్సీని ధరించనున్నది. ఈ మేరకు ట్విటర్ ద్వారా ముంబై ఆటగాళ్లు వేసుకునే జెర్సీలతో పాటు ఇందుకు గల కారణాలను వెల్లడించింది.
రోహిత్ సేన ఇలా ముంబై ఇండియన్స్ మహిళల జెర్సీ వేసుకోవడానికి వెనుక బలమైన కారణముంది. రిలయన్స్ ఆధ్వర్యంలో నడిచే ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఈఎస్ఎ) క్యాంపెయిన్ లో భాగంగా ముంబై ఆటగాళ్లు ఈ జెర్సీని ధరించనున్నారు.
ఆడపిల్లలకు విద్య, క్రీడల్లో ప్రోత్సాహం కల్పిస్తూ వారికి క్రీడా రంగంలో కావాల్సిన మద్దతును అందివ్వడం ఈఎస్ఎ ప్రధాన ఉద్దేశం. ఈఎస్ఎ ఫౌండేషన్ డే ను పురస్కరించుకుని వారిలో స్ఫూర్తి నింపేందుకు గాను ముంబై ఆటగాళ్లు ఆదివారం ఈ జెర్సీతో మెరవనున్నారు. ఈఎస్ఎ ముంబైతో పాటు దేశంలోని వివిధ ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నది.
వాంఖెడేకు 19 వేల మంది చిన్నారులు..
ఈఎస్ఎ ఫౌండేషన్ డే లో భాగంగా కేకేఆర్ తో ఆడబోయే మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ ఏకంగా 36 ఎన్జీవోలలోని 19వేల మంది చిన్నారుల (అమ్మాయిలు)కు ప్రత్యక్షంగా చూపించనుంది. వీరిలో 200 మంది స్పెషల్లీ ఏబుల్డ్ (అంగ వైక్యలం కలిగిన చిన్నారులు) చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం అన్ని ఏర్పాట్లను చేసినట్టు నీతా అంబానీ తెలిపారు. ఈ మేరకు ముంబై ఇదివరకే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. చిన్నారులను వాంఖెడేకు తరలించడానికి 500 ప్రైవేట్ బస్సులు, 2 వేల మంది వాలంటీర్లను సిద్ధం చేసింది. అంతేగాక వీరికి ఆహారం అందించేందుకు కూడా ఒక లక్ష ఫుడ్ పాకెట్స్, నీటి సదుపాయాన్ని కూడా కల్పించింది. మ్యాచ్ చూడటానికి వచ్చే చిన్నారులంతా ఆదివారం వాంఖెడేలో ఈఎస్ఎ టీ షర్ట్ లతో రోహిత్ సేనను ఎంకరేజ్ చేయనున్నారు.
టాస్కు హర్మన్ ప్రీత్ కూడా..
ముంబై ఇండియన్స్ ట్విటర్ లో పోస్ట్ చేసిన వీడియోలో నీతా అంబానీ మాట్లాడుతూ.. ఇది ముంబై ఇండియన్స్ కు చాలా స్పెషల్ మ్యాచ్ అని చెప్పుకొచ్చారు. 19 వేల మంది చిన్నారులు తమ అభిమాను క్రికెటర్లను నేరుగా చూసేందుకు గాను రాబోతున్నారని, వారిలో స్పూర్తి రగల్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ మ్యాచ్ కు అమ్మాయిల తరఫున ముంబై ఇండియన్స్ మహిళా జట్టు సారథి హర్మన్ప్రీత్ కౌర్ కూడా రాబోతుందని.. టాస్ వేసే సమయంలో కూడా ఆమె అక్కడే ఉంటుందని వెల్లడించారు.
