ధోని అరుదైన ఘనత.. ఆ సిక్సర్ పడ్డ చోటును విక్టరీ మెమోరియల్గా మార్చిన ఎంసీఎ
2011 WC Victory Memorial: టీమిండియా మాజీ సారథి ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది.
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) ధోనిని సగర్వంగా సత్కరించింది. 2011లో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో భారత్ ఆడిన ఫైనల్స్ లో ధోని విన్నింగ్ షాట్ కొట్టిన విషయం తెలిసిందే. నువాన్ కులశేఖర బౌలింగ్ లో లాంగాన్ మీదుగా ధోని సిక్సర్ కొట్టగా.. ఆ బంతి పడ్డ చోటును ఎంసీఎ ‘2011 వరల్డ్ కప్ విక్టరీ మెమోరియల్’ గా మార్చింది.
సరిగ్గా ఆ బంతి పడ్డ చోటును వరల్డ్ కప్ విక్టరీ మెమోరియల్ గా మార్చిన ఎంసీఎ.. ధోని తోనే దానిని ప్రారంభించింది. ముంబై ఇండియన్స్ తో ఐపీఎల్-16 లో మ్యాచ్ ఆడేందుకు వాంఖెడేకు వచ్చిన ధోనితో ఎంసీఏ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ధోని కొట్టిన బంతి పడ్డ చోటును అలంకరించి అతడితోనే ఓపెనింగ్ చేయించింది.
ముంబై - చెన్నై మధ్య శనివారం రాత్రి జరుగనున్న ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్ కు ముందు ధోనితో ఈ వరల్డ్ కప్ విక్టరీ మెమోరియల్ ను ప్రారంభించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 2011 ఏప్రిల్ 2న భారత జట్టు.. తమ రెండో వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుని 12 ఏండ్లు పూర్తయిన విషయం తెలిసిందే.
వరల్డ్ కప్ ఫైనల్ లో ఇలా..
క్వార్టర్స్ లో ఆస్ట్రేలియాను, సెమీస్ లో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరిన టీమిండియా.. ఫైనల్ లో లంకతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ జట్టులో మహేళ జయవర్దెనే (103) సెంచరీ చేయగా తిలకర్నతే దిల్షాన్ (48), నువాన్ కులశేఖర (32) రాణించారు.
275 పరుగుల లక్ష్యంలో భారత జట్టు.. 31కే ఓపెనర్లిద్దరి వికెట్లనూ కోల్పోయింది. వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ అవగా టోర్నీ ఆసాంతం రాణించిన సచిన్ టెండూల్కర్ (18) కూడా విఫలమయ్యాడు. అప్పుడే కొత్తగా టీమ్ లోకి వస్తున్న విరాట్ కోహ్లీ (35) తో కలిసి గౌతం గంభీర్ (97) భారత ఇన్నింగ్స్ ను కుదుటపరిచాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 83 పరుగులు జోడించారు. కానీ కోహ్లీని దిల్షాన్ ఔట్ చేశాడు.
అప్పుడొచ్చాడు ధోని..
కోహ్లీ నిష్క్రమణ తర్వాత వాస్తవానికి ఐదో స్థానంలో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కు రావాలి. కానీ సారథి ధోని.. క్రీజులోకి వచ్చాడు. గంభీర్ తో కలిసి ఒక్కో పరుగు కూడదీసుకుంటూ భారత్ ను విజయం వైపునకు నడిపించాడు. గంభీర్ - ధోనిలు నాలుగో వికెట్ కు 109 పరుగులు జోడించారు. గంభీర్ ను పెరీరా ఔట్ చేసినా అప్పటికే భారత విజయానికి చేరువలో ఉంది. చివర్లో యువరాజ్ (21 నాటౌట్) తో కలిసి ధోని.. 91 పరుగులతో నాటౌట్ గా నిలవడమే గాక భారత్ కు వన్డే వరల్డ్ కప్ అందించాడు.